దుబాయ్ పర్యటనలో ఏపీకి భారీ పెట్టుబడులు తీసుకువస్తున్నట్లు మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి ప్రకటించడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సెటైర్లు వేశారు. ఖాళీ కుర్చీలకు ఊకదంపుడు ఉపన్యాసం ఇవ్వడానికి అబుదాబి వరకూ వెళ్లాలా మేకపాటి గౌతమ్ రెడ్డి గారూ అంటూ ఎద్దేవా చేశారు. పైగా జగన్ గురించి పెద్దగా ఇక్కడ ఎవరికి తెలియదని సెలవివ్వడం మేకపాటి గౌతమ్రెడ్డి స్పీచ్కే హైలెట్ అని లోకేష్ విమర్శలు చేశారు. చెత్త పాలన, బెదిరింపుల దెబ్బకి ఇతర రాష్ట్రాలకు పారిపోతున్న కంపెనీలు మీ ఘనత గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని.. అందుకే ఇలా అంతర్జాతీయ స్థాయిలో ఏపీ పరువు గంగలో కలిసిపోయిందని లోకేష్ మండిపడ్డారు. కొత్త కంపెనీలు తెచ్చి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం మీకెలాగో చేతకాదు.. కనీసం ఉన్న కంపెనీలు పోకుండా చూడండి అదే పదివేలు అంటూ లోకేష్ హితవు పలికారు.
Read Also: Andhra Pradesh: భీమ్లా నాయక్కు గుడ్న్యూస్..? ఏపీలో రేపు టిక్కెట్ల కమిటీ సమావేశం
కాగా ఇప్పటికే దుబాయ్ పర్యటనలో మూడువేల కోట్లకు పైగా పెట్టుబడులతో మూడు సంస్థలతో ఎంవోయూలు కూడా కుదుర్చుకున్నట్లు మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి ప్రకటించారు. ఇంకా పలు కంపనీలు ఏపీలో పెట్టబడులకు సిద్ధంగా ఉన్నాయని మంత్రి మేకపాటి వివరించారు. లండన్కు చెందిన కాజస్ ఈ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో పాటు రీజెన్సీ గ్రూప్తో ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుందని ఆయన తెలిపారు.