NSTR Forest Entry Ban: నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఆంక్షలు.. 3 నెలలు నో ఎంట్రీ..!

Nstr Forest Entry Ban

Nstr Forest Entry Ban

NSTR Forest Entry Ban: నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ (ఎన్‌ఎస్‌టీఆర్) పరిధిలో ఆంక్షలు విధించారు అధికారులు.. ఇవాళ్టి నుంచి మూడు నెలల పాటు ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.. అంటే.. జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు మూడు నెలలపాటు జనసంచారంపై పూర్తిస్థాయి ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. పులుల పునరుత్పత్తి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్‌టీసీఏ) మార్గదర్శకాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. వర్షాకాలమైన జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలు పులుల సంభోగం, సంతానోత్పత్తికి అత్యంత కీలకమైన కాలంగా పరిగణిస్తారు. ఈ సమయంలో మానవ సంచారం తగ్గించడం ద్వారా పులులకు అనుకూలమైన సహజ వాతావరణం కల్పించి వాటి సంఖ్య పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతి ఏడాది ఈ నిబంధనను అమలు చేస్తోంది.

ఈ ఆంక్షలతో ఎన్‌ఎస్‌టీఆర్ కోర్ ఏరియాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు సందర్శకులకు అనుమతి ఉండదు. మార్కాపురం అటవీ డివిజన్ పరిధిలోని ఇష్టకామేశ్వరి ఆలయం, రుద్రకోడూరు, గుండ్లబ్రహ్మేశ్వరం వంటి పుణ్యక్షేత్రాలతో పాటు కోర్ ఏరియాలో నిర్వహించే జంగిల్ సఫారీలను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. అలాగే శ్రీశైలానికి అటవీ మార్గంలో పాదయాత్రగా వెళ్లే భక్తులకు కూడా ఈ మూడు నెలల పాటు ప్రవేశం ఉండదు.

అయితే బఫర్ ఏరియాలోని కొన్ని ఎకోటూరిజం కేంద్రాలు యథావిధిగా కొనసాగనున్నాయి. బైర్లూటి, పచ్చర్ల, తుమ్మలబయలు వంటి ప్రాంతాల్లో పరిమిత కార్యకలాపాలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్‌గా గుర్తింపు పొందిన నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ 3,727.82 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో విస్తరించి ఉంది. 2023 పులుల లెక్కల ప్రకారం ఇక్కడ 75 పులులు ఉండగా, ప్రస్తుతం పులికూనలతో కలిపి వాటి సంఖ్య సుమారు 87కు చేరినట్లు అటవీశాఖ అంచనా వేస్తోంది. పులుల సంరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణ, పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ఈ ఆంక్షలు కీలకమని అధికారులు పేర్కొన్నారు. జనసంచారం తగ్గడం వల్ల పులులు ప్రశాంతంగా సంచరించి సంతానోత్పత్తి ప్రక్రియను సహజంగా కొనసాగించే అవకాశం ఉంటుందని వెల్లడించారు.