Janasena Political Affairs Committee Irony
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభను చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. 8 వసంతాలు పూర్తి చేసుకుని 9వ వసంతంలోకి అడుగు పెడుతున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరి సమీపంలోని ఇప్పటంలో భారీ బహిరంగ సభ కొనసాగుతుంది. ఈ సందర్భంగా జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు నాగబాబు మాట్లాడుతూ.. మూడేళ్లు రాజధాని లేకుండా పరిపాలించిన ఘనత మన సీఎం జగన్ కే దక్కుతుందన్నారు. రాజధాని రైతుల అకుంఠిత దీక్ష, న్యాయస్థానాల తీర్పులు, జనసేనాని, జనసేన సాగించిన అద్భుత పోరాటం వల్ల ఇవాళ ఏపీకి అమరావతే రాజధాని అని ఖరారైందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా జగన్ ఇప్పటికైనా ఈ తీర్పును శిరసావహించి పైకోర్టులకు వెళ్లొద్దని ఆయన హితవు పలికారు.
మిగిలిన రెండేళ్లు రాజధాని సహితంగా పాలించాలని, లేకపోతే ఐదేళ్ల పాటు రాజధాని లేకుండా పాలించిన ఘనతను సొంతం చేసుకోవాల్సి ఉంటుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. “నా అనుభవంలో మంచి ముఖ్యమంత్రులను చూశాను, చెడ్డ ముఖ్యమంత్రులను చూశాను. కానీ ఇంత దుర్మార్గమైన పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రిని జగన్ నే చూస్తున్నా” అంటూ విమర్శించారు. రాజకీయ దొంగలను కూడా ప్రజలే ఎన్నుకుంటున్నారని, రాజకీయ దొంగలు ప్రజల భవిష్యత్తును దోచుకుంటారని అన్నారు.