Nadendla Manohar Assures Diesel Supply Restoration : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా తలెత్తిన పెట్రోల్, డీజిల్ కొరతపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వేగంగా స్పందించింది. ఇంధన సరఫరాలో ఏర్పడిన ఇబ్బందులు , కృత్రిమ కొరతపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఉన్నతాధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పెట్రోల్ బంకులకు రేపు ఉదయం 6 గంటల కల్లా ఇంధన సరఫరాను పునరుద్ధరించాలని మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు పూర్తిస్థాయిలో పెట్రోల్, డీజిల్ చేరుతుందని, ఎక్కడా ‘నో స్టాక్’ బోర్డులు లేకుండా సాధారణ స్థితికి తీసుకొస్తామని హామీ ఇచ్చారు.
ఇంధన కొరతను ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు బ్లాక్ మార్కెట్కు పాల్పడుతున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై మంత్రి ఘాటుగా స్పందించారు. కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయించే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో నిఘా పెంచేందుకు వీలుగా ప్రత్యేక ‘ఫ్లయింగ్ మొబైల్ స్క్వాడ్’లను ఏర్పాటు చేయాలని, బంకుల వద్ద ఎటువంటి గొడవలు జరగకుండా పోలీసులతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు. సరఫరాలో కేవలం చిన్నపాటి సాంకేతిక లోపాలు మాత్రమే ఉన్నాయని, కానీ సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ప్రజలు భయాందోళనతో (Panic buying) అవసరానికి మించి ఇంధనాన్ని కొనుగోలు చేయవద్దని, ముఖ్యంగా డబ్బాలు , డ్రమ్ముల్లో పెట్రోల్ నిల్వ చేసుకోవద్దని మంత్రి కోరారు. అటువంటి వారికి ఇంధనం విక్రయించవద్దని బంకు యజమానులకు నిబంధనలు విధించారు. ప్రస్తుతం రాష్ట్ర అవసరాలకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని ఆయిల్ కంపెనీలు ధృవీకరించినట్లు మంత్రి తెలిపారు. ఈ కీలక సమయంలో అధికారుల మధ్య ఎటువంటి మిస్ కమ్యూనికేషన్ ఉండకూడదని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రతి జిల్లాలో జాయింట్ కలెక్టర్లు పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశిస్తూ, రాష్ట్రంలో ఇంధన సరఫరా వ్యవస్థను త్వరలోనే గాడిలో పెడతామని భరోసా ఇచ్చారు.
