శ్రీకాళహస్తి ఆస్థాన జ్యోతిష సిద్ధాంతి, శ్రీశైల పీఠాధిపతి వీరశైవ పీఠాధిపతి శ్రీ ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి శివైక్యం పొందారని mulugu.com నిర్వాహకులు కొడుకుల సోమేశ్వర్ రావ్ తెలిపారు. దాదాపు 4 దశాబ్ధాలకు పైగా నిష్పక్షపాతమైన, నిజమైన జ్యోతిష ఫలితాలు, పంచాంగం ద్వారా భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలను తన పంచాంగం ద్వారా ప్రజలకు తెలియజేసేవారు.
లక్షలాది మందికి మార్గదర్శనం చేయించిన ములుగు సిద్ధాంతి గుంటూరు నుంచి వచ్చి హైదరాబాద్ లో స్థిరనివాసం ఏర్పరుచుకున్నారు. ఎంతోమంది సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులకు, దేశ విదేశాలనుంచి వచ్చేవారికి వంశపారంపర్యంగా వస్తున్న తమ దైవ కృప వలన జాతక విశ్లేషణ చేసి వారి సమస్యలకు పరిష్కారాలు తెలిపి ఎన్నో కుటుంబాలకు ఆరాధ్యులుగా ఉన్నారు.
శ్రీశైలంలో ఆశ్రమం స్థాపించి, వేదాలలో, పూజ, హోమాది క్రతువులలో శిక్షణపొందిన బ్రాహ్మణులతో ప్రతీ మాస శివరాత్రికి పాశుపతహోమాలు నిర్వహించేవారు.
అందరికన్నా దైవం గొప్పదని, ఆ దైవం మంత్రానికి సంతుష్టుడవుతాడని, హోమం ప్రీతితో స్వీకరించి మనకు కావాల్సిన ఫలితాన్ని అందిస్తారని చెప్పేవారు. ప్రతి ఏటా ములుగు సిద్ధాంతి అందించే పంచాంగ ఫలితాలు ములుగు యూట్యూబ్ ఛానెల్ ద్వారా కోట్లాది మంది వీక్షకులకు ఉచితంగా అందిస్తున్నామని, ఈ సందర్భంగా ఛానెల్ నిర్వాహకులు కొడుకుల సోమేశ్వరరావు తెలిపారు.
లోక కళ్యాణం కోసం, కరోనా మహమ్మారినుండి ప్రపంచానికి రక్షణ కోసం ఇటీవల యాదగిరిగుట్ట, శ్రీశైలం, శ్రీకాళహస్తిలలో ఆయుష్య హోమాలు నిర్వహించారు ములుగు సిద్ధాంతి. వివిధ దేశాలలో వీరికి భక్తులున్నారు. ములుగు సిద్ధాంతి గా ఆధ్యాత్మ జీవనాన్ని ప్రారంభించడానికన్నా ముందు MR Prasad పేరుతో మిమిక్రీ కళాకారుడిగా అంతర్జాతీయ ఖ్యాతి గాంచారు. ఆయన చేసిన శ్రీదేవి పెళ్ళి క్యాసెట్ ఆరోజుల్లో లక్షలాది కాపీలతో రికార్డులు సృష్టించింది.
సినీ నటులు AVS, బ్రహ్మానందం వంటి కళాకారులతో వేలాది ప్రదర్శనలు నిర్వహించారు ములుగు రామలింగేశ్వర వర ప్రసాద్. ములుగు సిద్ధాంతి గారి ఆశయాలను, వారి స్ఫూర్తితో ముందుకు తీసుకెళతామని, వారి దివ్య ఆశీస్సులతో ఆయన తలపెట్టిన పనులు తమవంతుగా చేస్తామని కుటుంబ సభ్యులు తెలియజేసారు. సోమవారం ఉదయం 11 గంటలకు రేస్ కోర్స్ వెనుక వున్న స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ ఆకస్మిక మరణానికి పలువురు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.