Kakani Govardhan Reddy: ఏపీలో తెలుగుదేశం పార్టీ తాజాగా వైసీపీ ప్రభుత్వ విధానాలను ఆరోపిస్తూ ‘ఇదేం ఖర్మ’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు మాట్లాడిన మాటలు చూసి ప్రజలు విస్తుపోతున్నారని.. చంద్రబాబు మానసిక స్థితి బాగోలేదని అర్థం అవుతోందని మంత్రి కాకాణి అన్నారు. కర్నూలు పర్యటనపై చంద్రబాబు జబ్బలు చరుచుకుంటున్నారని.. కర్నూలులో న్యాయ రాజధాని విషయంలో ఆయన ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబును ప్రశ్నిస్తే వారిని వైసీపీ కార్యకర్తలుగా ముద్ర వేస్తున్నారని.. టీడీపీ నేతలకు పచ్చ కండువాలు వేసి అమరావతి పేరుతో పాదయాత్ర చేయిస్తున్నారని చురకలు అంటించారు.
పరిపాలన వికేంద్రీకరణ ఎలా ఉండాలో సీఎం జగన్ చేసి చూపిస్తున్నారని మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి కొనియాడారు. సచివాలయ వ్యవస్థ ఇందుకు నిదర్శనం అన్నారు. రాజధానుల విషయంలో కూడా జగన్ వికేంద్రీకరణను అమలు చేయాలని భావిస్తున్నారని తెలిపారు. వికేంద్రీకరణకు అనుకూలమా.. వ్యతిరేకమా అనే విషయంపై చంద్రబాబు తన వైఖరి స్పష్టం చేయడం లేదని పేర్కొన్నారు. చంద్రబాబు తనపై ఉన్న అవినీతి కేసులపై స్టే తెప్పించుకున్నారని.. సీబీఐ రాష్ట్రంలోకి రాకూడదని జీవో ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు సీబీఐ విచారణ కావాలని కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
Read Also: Shocking: పిల్లలను కని అమ్మడమే వారి పని.. ఇప్పటికి ఎంతమందో తెలుసా..
చంద్రబాబు చరిత్ర ఎప్పుడో ముగిసిపోయిందని మంత్రి కాకాణి అన్నారు. ఆయన ప్రజల్లో లేరని.. కేవలం పచ్చ మీడియాలో మాత్రమే ఉన్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ సమావేశంలోనే వైసీపీ పటిష్టంగా ఉందని ఆ పార్టీ సర్వే సిబ్బంది చెప్పారని.. ఇదేం ఖర్మ అని చంద్రబాబును చూసి ప్రజలు అంటున్నారని.. అందుకే ఈ పేరుతోనే ఆయన ప్రజల్లో వెళ్తున్నారని చురకలు అంటించారు. చంద్రబాబుకు అల్జీమర్స్ ఉందని.. దీంతో పాటు ఆయన మానసిక పరిస్థితి కూడా బాగోలేదన్నారు.
