జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నర్సాపురం బహిరంగ సభలో వైసీపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలకు మంత్రి సిదిరి అప్పలరాజు కౌంటర్ ఇచ్చారు. మత్స్యకారుల బ్రతుకులు వలసల మీద ఆధారపడకూడదని తమ ప్రభుత్వం ప్రణాళికల ఆధారంగా ముందుకు వెళ్తుందని ఆయన వివరణ ఇచ్చారు. సీఎం చేపలు అమ్ముకోవాలా, మటన్ అమ్ముకోవాలా అని పవన్ అడుగుతున్నారని.. మత్స్యకారుల బ్రతుకులు మారకూడదా అని ప్రశ్నించారు. మత్స్యకారులను ఎంటర్పెన్యూనర్లుగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి అప్పలరాజు తెలిపారు.
చరిత్రలో తొలిసారి సినిమా ప్రమోషన్ కోసం రాజకీయాలను వాడుకోవడం చూస్తున్నామని మంత్రి అప్పలరాజు ఎద్దేవా చేశారు. దేశంలో అత్యధిక హార్బర్లను నిర్మిస్తున్న రాష్ట్రం ఏపీనే అని ఆయన తెలిపారు. పవన్కు ఇప్పటికైనా మంచి బుద్ది రావాలని, చంద్రబాబు మాయ నుంచి బయటపడాలని తాను కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్యాకేజీలు మాని ప్రజా సమస్యల కోసం పనిచేయాలని పవన్కు హితవు పలికారు. జనసైనికులైన యువకులందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నానని.. పవన్ మాటలు నమ్మవద్దని కోరారు. యువకులు పవన్ వలలో పడవద్దన్నారు. జనసైనికుల ఆశయన్ని, కష్టాన్ని, పోరాటాన్ని పవన్ వేరొకరి వద్ద తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. ఊడిగం చేయటం, అమ్ముడుపోవడం పవన్ చరిత్ర అని విమర్శించారు.
