ఏపీలో సంచలనం సృష్టించిన సినిమా టికెట్ల ధర వ్యవహారం కొలిక్కి వచ్చేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నేడు సినిమా టికెట్ల కమిటీ భేటీ కానుంది. ఇప్పటికే డ్రాఫ్ట్ రికమెండేషన్లు సిద్ధమయ్యాయి. ఇవాళ్టీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. భౌగోళిక క్యాటగిరీలో జీవో 35 ప్రకారం నాలుగు ప్రాంతాలు కాకుండా మూడు ప్రాంతాలుగానే కమిటి సిఫార్సు చేసింది. గ్రామ పంచాయతీ, నగర పంచాయతీ కలిపి నగర పంచాయతీ ఏరియాగా సిఫార్సు చేసినట్టు సమాచారం. మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీల వారీగా టిక్కెట్ ధరల ఖరారుకు కమిటీ సిఫార్సు చేయనుంది.
టికెట్ల క్లాసుల్లోనూ సవరణకు సూచనలు చేసే అవకాశం ఉంది. ఇప్పుడున్న మూడు క్లాసులకు బదులు ఇకపై రెండు క్లాసులు మాత్రమే ఉంచేలా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దీంతో డీలెక్స్ కేటగిరి ఎగిరిపోయే అవకాశం ఉంది. అన్ని థియేటర్లలోనూ ఎకానమీ, ప్రీమియం రెండే క్లాసులకు కమిటీ సిఫార్సు చేయనుంది. 40 శాతం సీట్లు ఎకానమీ కేటగిరి, 60 శాతం ప్రీమియం కేటగిరి కింద కేటాయించాలని కమిటీ సూచనలు చేసే విధంగా నిర్ణయం తీసుకోనుంది.