Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు

Perni Nani

Perni Nani

Krishna Delta Water Crisis: కృష్ణా డెల్టాలో సాగునీటి సమస్యపై వైసీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన డెల్టా పరిధిలోని రైతుల పరిస్థితిని వివరించారు. కృష్ణా డెల్టాలో ఆరు లక్షలకు పైగా ఎకరాల ఆయకట్టు ఉన్నప్పటికీ, ఇప్పటికీ దాదాపు 50 నుంచి 55 వేల ఎకరాల్లో సాగు ప్రారంభం కాలేదని తెలిపారు. సాగు సమయం వచ్చినా నీరు అందక రైతులు పంటలు వేసుకోలేక పొలాలను ఖాళీగా ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్ని నాని పేర్కొన్నారు. అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక, తోట్లవల్లూరు, మచిలీపట్నం నార్త్ ప్రాంతాల్లో దాదాపు 90 శాతం వరకు సాగు జరగలేదని తెలిపారు. మచిలీపట్నం సౌత్‌లో కూడా సుమారు 40 శాతం భూములు ఇంకా సాగుకు దూరంగా ఉన్నాయని చెప్పారు.

గూడూరు, పెడన, బంటుమిల్లి, కృతివెన్ను ప్రాంతాల్లో దాదాపు 20 వేల ఎకరాల్లో ఇప్పటికీ సాగు ప్రారంభం కాలేదని పేర్ని నాని వివరించారు. గుడివాడ రూరల్, గుడ్లవల్లేరు ప్రాంతాల్లో కూడా వందల ఎకరాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. మొక్కలు నాటాల్సిన సమయంలో నీరు అందకపోవడంతో రైతులు పంటలు వేయలేకపోతున్నారని అన్నారు. సాగు ఆలస్యం కావడం వల్ల రైతుల పెట్టుబడులు పెరగడంతో పాటు దిగుబడులపైనా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని పేర్ని నాని పేర్కొన్నారు. పంటలు వేసిన రైతుల్లో కూడా ఆందోళన కొనసాగుతోందన్నారు. పంటకు అవసరమైన కీలక సమయంలో నీరు అందకపోతే పంటలు ఎండిపోయి, రైతులు పెట్టిన మొత్తం పెట్టుబడి నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపారు.

పులిచింతలలో నీటి నిల్వలు ఉన్నప్పటికీ కృష్ణా డెల్టాకు సాగునీరు అందడం లేదని పేర్ని నాని అన్నారు. నీరు ఎప్పుడు వస్తుందనే దానిపై స్పష్టత లేక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని చెప్పారు. నీరు అందుబాటులో ఉన్నప్పటికీ రైతులకు చేరకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. కృష్ణా డెల్టాలో రైతుల సాగునీటి సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. ఎక్కడెక్కడ సాగు జరగలేదో క్షేత్రస్థాయిలో పరిశీలించి, అవసరమైన నీటిని విడుదల చేసి రైతులు పంటలు వేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక, సాగునీటి సమస్య ప్రభావం రైతులకే పరిమితం కాదని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ కూలీలు, విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాలపై ఆధారపడే గ్రామీణ కుటుంబాల ఉపాధిపైనా దీని ప్రభావం పడుతుందని తెలిపారు. అందువల్ల ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని కృష్ణా డెల్టాలో సాగునీటి సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు మాజీ మంత్రి పేర్ని నాని..