Thota Trimurthulu: కాకినాడలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. 2019లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకపోవడానికి కాపు సామాజిక వర్గమే కారణమని బొండా ఉమా చేసిన వ్యాఖ్యలు నూటికి నూరు శాతం నిజమేనని అన్నారు. కాపు ఓటు ఎటు వైపు ఉంటే ఆ పార్టీ విజయం సాధిస్తుందని, కాపులు స్వయంగా ఎక్కువ మంది గెలవకపోయినా గెలిపించే, ఓడించే శక్తి తమకు ఉందని వ్యాఖ్యానించారు. ఇక, ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలకు టీడీపీ నాయకులు వెళ్లొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటని తోట త్రిమూర్తులు విమర్శించారు. రాజకీయాల్లో ఇంతకంటే దిగజారడం ఉండదన్నారు. విజయవాడలో ముద్రగడ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని బొండా ఉమా ప్రకటించడం అభినందనీయమని, ఆయన నిర్వహించే సంస్మరణ సభకు తాను తప్పకుండా హాజరవుతానని తెలిపారు.
ప్రజారాజ్యం పార్టీ కారణంగానే ఒకప్పుడు టీడీపీ ఓటమిపాలైందని గుర్తుచేసిన త్రిమూర్తులు, కాపు నాయకత్వానికి సరైన అవకాశాలు రాకపోవడం బాధాకరమన్నారు. వంగవీటి రంగా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలను అడ్డుకున్నారని, ముద్రగడ పద్మనాభం వద్ద సరైన సమయంలో రాజకీయ నిర్ణయాలు తీసుకునే సమయస్ఫూర్తి లేకపోవడం వల్ల కాపు వర్గానికి ముఖ్యమంత్రి పదవి దక్కలేదని వ్యాఖ్యానించారు. త్వరలోనే చంద్రబాబు నాయుడు కాపులకు ఇచ్చిన ఐదు శాతం రిజర్వేషన్ల అంశాన్ని ప్రజల ముందుకు తీసుకువస్తామని తోట త్రిమూర్తులు వెల్లడించారు. 2016లో ముద్రగడ ఉద్యమానికి మద్దతుగా తాను, బొండా ఉమా కలిసి వెళ్లిన విషయాన్ని గుర్తు చేస్తూ, అప్పట్లో వెళ్లొద్దని అప్పటి హోంమంత్రి రాజప్పతో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ఫోన్ చేసినా తాము వెనక్కి తగ్గలేదన్నారు.
ముద్రగడ పద్మనాభంపై యువత సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న విమర్శలు బాధ కలిగిస్తున్నాయని తోట త్రిమూర్తులు అన్నారు. ఆయన చేసిన మంచి పనులను గుర్తించాలని కోరారు. కాపు ఉద్యమానికి నాయకత్వం వహించిన తర్వాత ముద్రగడ వ్యక్తిగతంగా, రాజకీయంగా ఎంతో నష్టపోయారని పేర్కొన్నారు. 1978లో ముద్రగడతో పాటు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు రాజకీయంగా, ఆర్థికంగా ఎంతో ఎదిగారని, కానీ ముద్రగడ మాత్రం తన ఆస్తులు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎదుర్కొన్నారని వ్యాఖ్యానించారు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు..

