వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. నిందితుల ఇళ్లలోనే వివేకా హత్యకు వాడిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్న అధికారులు ఇవాళ పలువురు స్థానిక నేతలను ప్రశ్నించారు.. మరోవైపు.. తమ ప్రాణాలకు ముప్పు ఉందని వైస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి కడప జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు. ఆ తర్వాత సునీత లేఖపై స్పందించారు కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్.. సునీత కుటుంబ రక్షణ కోసం చర్యలను చేపట్టామని తెలిపారు.. వారికి వ్యక్తిగత రక్షణ కల్పించడంతో పాటు, పులివెందులలో వారి నివాసం వద్ద సెక్యూరిటీ ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.. ఇక, లేఖలో సునీత పలు విషయాలను పేర్కొన్నారని… వాటిపై కూడా విచారణ చేస్తామని తెలిపారు ఎస్పీ..
కాగా, తన తండ్రి హత్యపై న్యాయపోరాటం చేస్తున్న సునీతారెడ్డి.. ఈ కేసు విషయంలో ఢిల్లీ వరకు కూడా వెళ్లివచ్చారు.. మధ్య మధ్యలో సీబీఐ అధికారులను కలుస్తూ ఆరా తీస్తున్నారు.. ఈ నేపథ్యంలో.. ఈనెల 10వ తేదీ సాయంత్రం 5.20 గంటలకు ఒక అనుమానితుడు తమ ఇంటి చుట్టూ తిరిగారని కడప ఎస్పీకి రాసిన లేఖలో పేర్కొన్నారు సునీత. ఆ తర్వాత కొన్ని ఫోన్ కాల్స్ కూడా వచ్చాయని.. వివేకా హత్య కేసు అనుమానితుడు శివశంకర్ రెడ్డి పుట్టినరోజున ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఉన్న మణికంఠరెడ్డి అనే వ్యక్తి మాదిరే అతను ఉన్నాడని.. దీంతో.. తమ కుటుంబ భద్రత పట్ల ఆందోళన కలుగుతోందని ఆ లేఖలో పేర్కొన్నారు సునీత.