హ్యాష్ ట్యాగ్ జస్టిస్ ఫర్ పంజాబీ గర్ల్ ..ఇప్పుడు ఇది ట్విటర్లో విపరీతంగా ట్రెండింగ్ అవుతోంది. అయితే ఈ ట్రెండింగ్ కారణం ఏమిటి? జనసేన అధినేత పవన్కల్యాణ్పై నటుడు పోసాని కృష్ణమురళి చేసిన కామెంట్స్తో ఈ అంశం తెరమీదకు వచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియాలో దీనిపై పెద్ద రచ్చ జరుగుతోంది.
అసలు ఏం జరిగిందో చూస్తే…
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం రాత్రి జరిగిన రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో జగన్ సర్కార్ పై తన సహజ శైలిలో ఫైర్ అయ్యారు. దాంతో ycp నేతలు వెంటనే కౌంటర్ ఎటాక్కు దిగారు. జగన్పై నోరు పారేసుకుంటే ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. రాజకీయంగా విభేదించే నటులపై ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని పవన్ ఆరోపించటంపై రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద చర్చకు దారితీసింది. పవన్ వ్యాఖ్యలను నటులు నాని,కార్తికేయ గుమ్మకొండ వంటి వారు సమర్ధించారు. మరోవైపు, నటుడు పోసాని కృష్ణ మురళి ఓ వివాదాస్పద అంశాన్ని తెరమీదకు తెచ్చారు. అదే ఇప్పుడు సామాజిక మాద్యమాలలో ట్రెండింగ్ అవుతోంది.
పోసాని చెప్పినదాని ప్రకారం… ఓ పంజాబీ అమ్మాయి హీరోయిన్ కావాలని ఎన్నో కలలతో తెలుగు చిత్ర పరిశ్రమకు వచ్చింది. ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రముఖుడు ఆమెకు కెరీర్ ఇస్తానంటూ ప్రామిస్ చేసి మోసం చేశాడు. ఆమెను గర్భవతిని కూడా చేశాడు. అయితే విషయం ఎవరికీ చెప్పవద్దని బెధిరించాడు. అందుకు గాను 5 కోట్ల రూపాయలు కూడా ఇచ్చాడు. కాదు కూడదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చాడట. ఏపీ సీఎం జగన్, మంత్రులపై పవన్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పోసాని కృష్ణమురళి సోమవారం హైదరాబాద్ గచ్చిబౌలిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఆ ప్రముఖ వ్యక్తి చేతిలో మోసపోయిన ఆ పంజాబ్ అమ్మాయి పేరు పవన్కల్యాణ్ చెవిలో చెబుతానన్నారు. ఆ అమ్మాయి పేరు మీడియాకు చెప్పి, ఆ ప్రముఖ వ్యక్తిపై పోరాటం చేసి ఆమెకు న్యాయం చేస్తే ఆయనకు గుడి కడతానని చెప్పారు. ఆ పిల్ల జీవితాన్ని బాగుచేస్తే పవన్ ముందు జగన్ కుడా పనికిరారని పేర్కొన్నారు. ఆ అమ్మాయికి అండదండలు అందించకపోతే పవన్కల్యాణ్కు ఎవరినీ ప్రశ్నించే అర్హతలేదని చెప్పారు.
పంజాబీ అమ్మాయికి న్యాయం చేయాలని నెటిజన్లు ట్విటర్ వేదికగా పోస్టులు పెడుతున్నారు. మోసం చేసిన వాడిని జైల్లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. పోసాని ప్రకటన తర్వాత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలయింది. పంజాబ్ యువతిని మోసం చేసిన వ్యక్తిపై కేసు పెట్టాలని, బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కొంతమంది ఏకంగా సీబీఐతో దర్యాప్తు చేయించాలంటున్నారు. దీంతో #JusticeforPunjabiGirl హ్యాష్టాగ్ ట్విటర్లో ట్రెండింగ్గా మారింది.
మరోవైపు, పవన్ వ్యాఖ్యలపై రెండు రాష్ట్రాల తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ డిస్టెన్స్ మెయింటెయిన్ చేస్తోంది. సినీ రంగానికి చెందిన పలువురు వివిధ సందర్భాలలో దీనిపై కామెంట్ చేస్తున్నారని అయితే వాటిని తెలుగు సినీ పరిశ్రమ చేసినట్టుగా భావించరాదని TFCC చైర్మన్ నారాయణదాస్ కృష్ణదాస్ అన్నారు.