Pawan Kalyan Tributes Pingali Venkaiah: జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవాల సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ మహానుభావుడికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేశారు. మూడు వర్ణాలతో మురిపించే భారత జాతీయ పతాకాన్ని పింగళి వెంకయ్య రూపొందించారని.. భారతీయుల ఏకత్వానికి, శౌర్యానికి, స్వాభిమానానికి, సార్వభౌమత్వానికి, సమున్నతకి అది ప్రతీకగా నిలిచిందని పవన్ అన్నారు. మన త్రివర్ణ పతాకాన్ని వీక్షించిన మరుక్షణం శరీరం రోమాంచితం కాని భారతీయులు ఉండరంటే అది అతిశయోక్తి కాదన్నారు. అంతటి శక్తి కలిగిన పతాకాన్ని రూపొందించిన స్వాతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య చరితార్థుడు అని కొనియాడారు. ఆ పతాక తపశ్శాలి తెలుగు గడ్డపై జన్మించడం తెలుగు జాతి పుణ్యఫలం అన్నారు. ఆ మహానుభావుని 146వ జయంతి సందర్భాన తన పక్షాన, జనసేన పార్టీ పక్షాన నీరాజనాలు అర్పిస్తున్నట్లు తెలియజేశారు.
భారతదేశానికి స్వతంత్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తవుతున్న శుభతరుణంలో జాతి యావత్తు వజ్రోత్సవాలు జరుపుకోడానికి సమాయత్తమవుతున్న వేళ స్వర్గీయ పింగళి వెంకయ్య జయంతి కూడా జరగడం యాధృచ్చికమే అయినా అదొక మరుపురాని మహత్తర ఘట్టమని పవన్ కళ్యాణ్ అన్నారు. దేశం పరాయిపాలనలో అరాచకాలను చవి చూస్తున్న తరుణంలో జాతిని ఏకం చేయడానికి దేశానికి ఒక పతాకం అవసరమని ఏళ్ల తరబడి ఘోషిస్తూ, శ్రమిస్తూ చివరికి ‘ఏ నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా’ అనే పుస్తకాన్ని పింగళి వెంకయ్య రచించి, ప్రచురించారన్నారు. చివరకు 1921 మార్చిలో విజయవాడలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో మహాత్మా గాంధీజీ ఆశీస్సులతో పింగళి రూపొందించిన త్రివర్ణ పతాకం భారత జాతీయ పతాకంగా ఆమోదం పొందిందని.. ఈ ఘడియల కోసం పింగళి వెంకయ్య ఒక తపస్సునే చేశారని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు.
విద్యాధికుడు, వ్యవసాయం, భూగర్భ శాస్త్రంలో నిపుణుడు అయిన పింగళి వెంకయ్యను ఎందువల్లనో ఇటు తెలుగు రాజకీయ నాయకులు, అటు జాతీయ నాయకులు సరైన సమయంలో ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తించకపోవడంతో ఆర్థికంగా దుర్భరమైన జీవితాన్ని చరమాంకంలో చవి చూశారని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇది అత్యంత దురదృష్టకరమన్నారు. ఆ త్యాగశీలికి ‘భారతరత్న’ పురస్కారం అందించాలని తెలుగు ప్రజల కోరిక అని.. కానీ అది ఇంతవరకు నెరవేరకపోవడం విచారకరమన్నారు. దేశంలో ‘ఆజాది కా అమృతోత్సవ్’ వేడుకలు జరుగుతున్న ఈ శుభ ఘడియలలో పింగళి వెంకయ్య సేవలకు గుర్తింపుగా ఆయనకు భారతరత్న ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వాన్ని కోరుతున్నట్లు పవన్ పేర్కొన్నారు.
తెలుగు కీర్తి పతాక శ్రీ పింగళి వెంకయ్య గారు – JanaSena Chief Shri @PawanKalyan #PingaliVenkayya pic.twitter.com/OYLN2SByVA
— JanaSena Party (@JanaSenaParty) August 2, 2022