తిరుమల వెళ్లే శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ఐఆర్సీటీసీ రకరకాల ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తోంది. తాజాగా ఐఆర్సీటీసీ మరో టూర్ ప్యాకేజీని ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఉండే వారి కోసం మార్చి నెలలో ‘తిరుపతి దేవస్థానం’ పేరుతో టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఈ ప్యాకేజీ టూ డేస్, వన్ నైట్ ఉంటుంది. మార్చి 5, 12, 26 తేదీల్లో ఈ ప్యాకేజీ భక్తులకు అందుబాటులో ఉంటుంది. వీకెండ్లో శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమల వెళ్లాలనుకునే భక్తులకు ఈ టూర్ ప్యాకేజీ ఉపయోగపడుతుంది. ఈ టూర్ ప్యాకేజీలో తిరుమలలో శ్రీవారి దర్శనంతో పాటు తిరుచానూరు పద్మావతి ఆలయం, శ్రీకాళహస్తి ఆలయాలు కవర్ అవుతాయి.
అంతేకాకుండా ఈ ప్యాకేజీలో తిరుమలలో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ కూడా కలిపే ఉంటుంది. ఇప్పటికే ఐఆర్సీటీసీ టూరిజం హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నుంచి తిరుమలకు టూర్ ప్యాకేజీలను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఢిల్లీలో ఉన్న శ్రీవారి భక్తుల కోసం మరో ప్యాకేజీ ప్రకటించింది. ఈ ప్యాకేజీలో భాగంగా తొలిరోజు ఉదయం 8:35 గంటలకు పర్యాటకులు ఢిల్లీ విమానాశ్రయంలో విమానం ఎక్కితే ఉ.11:30 గంటలకు చెన్నై చేరుకుంటారు. అక్కడి నుంచి తిరుపతి చేరుకుంటారు. చెన్నై నుంచి తిరుపతి వెళ్లే మార్గంలోనే శ్రీకాళహస్తి ఆలయ సందర్శన ఉంటుంది. తిరుపతి చేరుకున్నాక హోటల్ గది కేటాయిస్తారు. ఆ తర్వాత తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ సందర్శన ఉంటుంది. రాత్రికి తిరుపతిలో బస చేయాలి.
రెండో రోజు ఉదయం భక్తులను తిరుమలకు తీసుకెళ్తారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవాలి. ఆ తర్వాత తిరుపతిలోని హోటల్కు చేరుకోవాలి. అనంతరం చెన్నై విమానాశ్రయానికి బయలుదేరాల్సి ఉంటుంది. రాత్రి 7:45 గంటలకు చెన్నైలో విమానం ఎక్కితే రాత్రి 10:45 గంటలకు ఢిల్లీ చేరుకోవడంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది. ఈ ప్యాకేజీలో ముగ్గురికైతే రూ.15,660, ఇద్దరికైతే రూ.15,800, ఒక్కరికైతే రూ.17,710 చెల్లించాలి.