ఏపీలో నిరుద్యోగులకు హెచ్సీఎల్ టెక్నాలజీస్ గుడ్ న్యూస్ అందించింది. ఏపీ నుంచి 1500 మంది ఫ్రెషర్స్ను రిక్రూట్ చేసుకునేందుకు ప్రక్రియను ప్రారంభించినట్లు హెచ్సీఎల్ వెల్లడించింది. ఈ మేరకు వాక్ ఇన్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపింది. ఇందుకోసం అభ్యర్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. పదో తరగతి పాసైన వారికి, ఇంటర్ పూర్తి చేసుకున్న వారికి ‘టెక్ బీ’ కార్యక్రమం కింద కెరీర్ లక్ష్యాలను సాధించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు హెచ్సీఎల్ చెప్పింది.
ఎంపికైన వారికి ప్రత్యేకంగా క్లాసులు నిర్వహించి శిక్షణ ఇస్తామని హెచ్సీఎల్ టెక్నాలజీస్ వైస్ ప్రెసిడెంట్ సుబ్బరామన్ బాలసుబ్రహ్మణ్యం వెల్లడించారు. అనంతరం ప్రతిభ కనబరిచిన వారికి హెచ్సీఎల్లో ఉద్యోగం కల్పించటంతో పాటు వర్క్ ఇంటిగ్రేటెడ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ద్వారా యూనివర్సిటీల్లో ఉన్నత విద్య చదివేందుకు సహకరిస్తామన్నారు. ఏపీలో గత రెండేళ్లుగా వెయ్యి మందిని టెక్బీ కింద తీసుకున్నట్టు తెలిపారు. ఈ ఏడాది(2022-23) ఏపీ నుంచి 1500 మంది ఫ్రెషర్స్ను రిక్రూట్ చేసుకోవాలని భావిస్తున్నట్టు చెప్పారు. అటు విజయవాడ హెచ్సీఎల్లో 3,500 మంది పని చేస్తున్నారని, క్యాంపస్ను పూర్తిస్థాయిలో విస్తరిస్తున్నామని హెచ్సీఎల్ హెడ్ శివప్రసాద్ వెల్లడించారు.