ఒక్కొక్కరికి ఒక్కో అభిమానం ఉంటుంది. కొందరికి సినిమా స్టార్లు అంటే పిచ్చి. ఇంకొందరికి రాజకీయ నేతలంటే అభిమానం. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్కు ఏపీలోనూ అభిమానులు ఉన్నారు. దీంతో కేటీఆర్ సీఎం కావాలంటూ ఏపీలోని ఓ అభిమాని బైక్ యాత్ర చేపట్టాడు. గుంటూరు జిల్లాకు చెందిన బాలరాజుగౌడ్ అనే వ్యక్తి వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ గుంటూరు జిల్లా మాచర్ల నుంచి యాదాద్రి వరకు బైక్ యాత్రకు శ్రీకారం చుట్టాడు.
తన బైక్ యాత్ర గురించి తాను తమ స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లానని బాలరాజుగౌడ్ మీడియాకు వెల్లడించాడు. తన యాత్రకు ఎమ్మెల్యే పిన్నెల్లి పర్మిషన్ కూడా ఇచ్చారని తెలిపాడు. కేటీఆర్ సీఎం కావాలని యాదాద్రిలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తనకు కేటీఆర్ విధానలు నచ్చుతాయని.. అందుకే తన అభిమాన నేత సీఎం కావాలని కోరుకుంటున్నట్లు వివరించాడు. తన అభిమాన నేత సీఎం కావాలని కోరుకోవడంలో తప్పేముందని కూడా బాలరాజు గౌడ్ అభిప్రాయపడుతున్నాడు.
