Gudivada Temple : గుడివాడలో ఘోరం.. స్వామివారి బంగారు కిరీటాన్ని తాకట్టు.!

  • స్వామివారికి సమర్పించిన రూ. కోటి విలువైన కిరీటం వివాదంలోకి
  • 461 గ్రాముల బంగారు కిరీటాన్ని రూ.38 లక్షలకు తాకట్టు పెట్టినట్టు ఆరోపణలు
  • బ్యాంక్ లాకర్‌లో ఉందంటూ కమిటీ సభ్యుల కాలయాపన
  • పోలీసులను ఆశ్రయించిన దాత కుటుంబం.. విచారణ ప్రారంభం
Gudivada

Gudivada

Gudivada Temple : భక్తులు దేవుడిపై భక్తితో, ఎంతో నమ్మకంతో సమర్పించిన కానుకలను కొంతమంది స్వార్థపరులు తమ సొంత వ్యాపారాలకు వాడుకుంటున్నారు. కృష్ణాజిల్లా గుడివాడలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఇలాంటి ఒక షాకింగ్ మోసం వెలుగులోకి వచ్చింది. స్వామివారికి అలంకరించమని భక్తులు ఇచ్చిన కోటి రూపాయల విలువైన బంగారు కిరీటాన్ని టెంపుల్ కమిటీ సభ్యులు ఒక ప్రైవేట్ షాపులో తాకట్టు పెట్టడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

2025 జనవరిలో మాటూరి సుబ్బారావు, లక్ష్మీ కుమారి అనే వృద్ధ దంపతులు తమ జీవితకాల కష్టాన్ని దేవుడికి అర్పించాలనుకున్నారు. ఏడుకొండల స్వామికి ప్రతీకగా, ఎన్నో ప్రత్యేకతలతో సుమారు 461 గ్రాముల బరువున్న ఒక అద్భుతమైన బంగారు కిరీటాన్ని తయారు చేయించారు. అందరి సమక్షంలో, ఒక పెద్ద వేడుక నిర్వహించి స్వామివారికి ఈ కిరీటాన్ని సమర్పించారు. ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం ఈ కిరీటం విలువ కోటి రూపాయలకు పైనే ఉంటుంది. అయితే, ఆర్యవైశ్య కళ్యాణమందిర కమిటీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ టెంపుల్ కమిటీ అధ్యక్షుడు మోహనరావు , ఇతర సభ్యులు కలిసి, ఆ కిరీటాన్ని పట్టణంలోని ఒక మార్వాడి దుకాణంలో రూ. 38 లక్షలకు తాకట్టు పెట్టారు.

విశేష రోజుల్లో, పండుగ ముహూర్తాల్లో కూడా స్వామివారికి ఆ కిరీటాన్ని అలంకరించకపోవడంతో దాతల కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. కిరీటం ఎక్కడని కమిటీని నిలదీయగా.. సెక్యూరిటీ కోసం బ్యాంకు లాకర్‌లో భద్రపరిచామంటూ కొన్ని రోజులుగా అబద్ధాలు చెప్తూ కాలయాపన చేశారు. అనుమానం పెరిగి దాతలు అంతర్గతంగా ఆరా తీయడంతో, కమిటీ సభ్యులు దాన్ని బయట తాకట్టు పెట్టిన అసలు విషయం బయటపడింది. స్వామివారికి అలంకరిస్తారని ఇస్తే, ఇలా భక్తుల కానుకలతో వ్యాపారం చేస్తారా అంటూ దాతలు, స్థానిక భక్తులు కమిటీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

“మేము 81 ఏళ్ల వయసులో ఉన్నాం.. ఎంతో భక్తితో స్వామివారికి కిరీటం ఇస్తే ఇంతటి ద్రోహానికి పాల్పడ్డారు. కిరీటం ఇచ్చినప్పుడు మాకు ఎలాంటి రసీదు కూడా ఇవ్వలేదు. మేము స్వామికి అలంకరించమని ఇచ్చాం కానీ, వీళ్లకు తాకట్టు పెట్టుకోమని కాదు. నా కిరీటం నాకు తిరిగి ఇప్పించేస్తే, దాన్ని వేరే ఏదైనా మంచి గుడికి ఇచ్చేస్తాను. మీడియా అయినా నాకు న్యాయం చేయాలి” అంటూ వృద్ధ దాత సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘోర మోసంపై దాత కుటుంబ సభ్యులు గుడివాడ టూ టౌన్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించారు.