Krishna District: రెండో పెళ్లి చేసుకుంటున్న భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య

కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో ఓ వ్యక్తి రెండో పెళ్లి చేసుకుంటూ భార్యకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. యాదాద్రి జిల్లా భువనగిరికి చెందిన మధుబాబు నాలుగేళ్ల క్రితం హైదరాబాద్ బోడుప్పల్‌కు చెందిన సరితను వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగిన వెంటనే సరితకు అత్తింటి నుంచి వరకట్న వేధింపులు మొదలయ్యాయి. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. మూడేళ్లుగా సరిత తల్లిదండ్రుల వద్దే నివసిస్తోంది.

భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో మధుబాబు మళ్లీ పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించగా సరిత రెండుసార్లు అడ్డుకుంది. అయినా అతడు రెండో పెళ్లి ప్రయత్నాలు ఆపలేదు. మూడోసారి కృష్ణా జిల్లాకు చెందిన ఓ యువతితో పెళ్లి ఖాయం చేసుకున్నాడు. ఈ మేరకు ఆదివారం పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయంలో మధుబాబు వివాహనం చేసుకుంటున్నాడు. సరిగ్గా ఆ సమయంలో సరిత కుటుంబ సభ్యులు ఒక్కసారిగా మధుబాబుపై దాడిచేసి వివాహాన్ని అడ్డుకున్నారు. దీంతో పెళ్లి ఆగిపోయింది. అనంతరం సరిత కుటుంబసభ్యులు మధుబాబును పోలీసులకు అప్పగించారు. ఇప్పటికే భువనగిరి పోలీస్ స్టేషన్‌లో మధుబాబుపై కేసు విచారణలో ఉంది.