Daggubati Purandeswari: 2024 ఫార్ములానే స్థానిక ఎన్నికల్లోనూ.. పురందరేశ్వరి కీలక వ్యాఖ్యలు

Daggubati Purandeswari

Daggubati Purandeswari

Daggubati Purandeswari: తూర్పుగోదావరి జిల్లా: స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కూటమి ఐక్యంగా పోటీ చేస్తుందని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి స్పష్టం చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే స్థానిక ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థుల విజయానికి అన్ని భాగస్వామ్య పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. రాజమండ్రిలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన “మన ఊరు – మన జెండా” కార్యక్రమాన్ని ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాజానగరం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పురందరేశ్వరి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ క్రమంగా బలోపేతం అవుతోందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని సూచించారు. 2024 ఎన్నికల్లో ప్రజలు కూటమికి అందించిన మద్దతును స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కొనసాగించాలని ఆమె కోరారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని పురందరేశ్వరి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే అమరావతి, పోలవరం ప్రాజెక్టుల అభివృద్ధి కొనసాగుతోందని అన్నారు. ప్రధాని మోదీ సహకారంతో రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత లభిస్తోందని తెలిపారు.

దేశ అభివృద్ధి విషయంలోనూ భారత్‌ ముందుకు సాగుతోందని పురందరేశ్వరి పేర్కొన్నారు. అభివృద్ధిలో 11వ స్థానం నుంచి మూడో స్థానానికి చేరుకున్నామని ఆమె తెలిపారు. రాష్ట్ర, దేశ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం కీలకమని ఆమె అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కూటమి భాగస్వామ్య పక్షాలు సమన్వయంతో ముందుకు సాగాలని ఆమె పిలుపునిచ్చారు. కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి..