Nidadavolu Municipality: వైసీపీకి మరో బిగ్‌ షాక్‌..! జనసేన ఖాతాలోకి నిడదవోలు..

  • వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్..
  • నిడదవోలు మున్సిపాలిటీని కైవసం చేసుకున్న జనసేన..
Nidadavolu

Nidadavolu

Nidadavolu Municipality: తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీ జనసేన కైవసం చేసుకుంది. మున్సిపాలిటీలో 28 మంది కౌన్సిలర్లు ఉండగా.. ఇందులో 27 మంది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. ఒక తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ ఉండేవారు. అయితే, జనసేన పార్టీకి ఒక్క కౌన్సిలర్ కూడా లేకపోయినా మున్సిపాలిటీ జనసేన పార్టీ ఖాతాలోకి చేరింది. గత నెల 20వ తేదీన వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు 17 మంది సంతకాలతో ఛైర్మన్‌ ఆదినారాయణపై కలెక్టర్‌కు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. అయితే, ఆ నోటీసు ఇచ్చినవారిలో ముగ్గురు కౌన్సిలర్లు జనసేన పార్టీలో చేరడంతో అవిశ్వాస తీర్మానానికి ఇచ్చిన నోటీసును జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి తిరస్కరించారు. దీంతో నిడదవోలు మున్సిపాలిటీ జనసేన వశమైంది.. జనసేన పార్టీలో చేరిన 14 మంది కౌన్సిలర్లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన మంత్రి కందుల దుర్గేష్.. పార్టీ సిద్ధాంతాలు, డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ఆశయలకు ఆకర్షితులై.. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ తో కలిపి 14 మంది కౌన్సిలర్లు పార్టీలో చేరారని తెలిపారు. వీరందరి సహకారంతో నిడదవోలు పట్టణాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు మంత్రి కందుల దుర్గేష్. అయితే, నిడదవోలు కూడా జనసేన ఖాతాలోకి వెళ్లిపోవడంతో.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలినట్టు అయ్యింది..

Read Also: Vaishnavi Chaitanya: పాపం.. వైష్ణవి మీద పడితే ఏం లాభం?