CM Jagan: ఏపీ సీఎం జగన్ మంగళవారం నాడు తిరుమలలో పర్యటించనున్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామికి పట్టువస్త్రాలను ఆయన సమర్పించనున్నారు. ఈ మేరకు రేపు మధ్యాహ్నం 3:35 గంటలకు గన్నవరం ఎయిర్పోర్టు నుంచి తిరుమలకు సీఎం జగన్ బయలుదేరనున్నారు. ఈ పర్యటనలో అలిపిరి వద్ద తిరుమలకు విద్యుత్ బస్సును సీఎం జగన్ ప్రారంభించనున్నారు. రాత్రి 8:20 గంటలకు తిరుమల శ్రీవారికి పట్టువ్రస్తాలు సమర్పిస్తారు. మంగళవారం రాత్రికి తిరుమలలోనే బసచేయనున్నారు. బుధవారం ఉదయం మరోసారి శ్రీవారిని సీఎం జగన్ దర్శించుకోనున్నారు. బుధవారం నాడు తిరుమలలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి నిర్మించిన పరకామణి భవనాన్ని, తర్వాత లక్ష్మీ వీపీఆర్ గెస్ట్హౌస్ను ప్రారంభిస్తారు.
Read Also: Team India: కుల్దీప్ ఖాతాలో మరో హ్యాట్రిక్.. టీమ్లోకి వచ్చేనా?
మరోవైపు బుధవారం నాడు నంద్యాలలో కూడా సీఎం జగన్ పర్యటించనున్నారు. బుధవారం ఉదయం తిరుమల నుంచి నేరుగా నంద్యాల చేరుకోనున్నారు. బుధవారం ఉదయం రేణిగుంట ఎయిర్పోర్టు నుంచి కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. ఓర్వకల్లు ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్లో నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలోని రాంకో సిమెంట్ ఫ్యాక్టరీకి వెళనున్నారు. ఈ మేరకు కంపెనీ ప్రాంగణంలో జరిగే కార్యక్రమాల్లో సీఎం జగన్ పాల్గొననున్నారు.
