నేనున్నాను.. నేను విన్నా.. అంటూ జనానికి భరోసా ఇస్తారు సీఎం జగన్. అడిగిన వెంటనే ఆదుకున్న మనసున్న మారాజు మా జగనన్నఅంటూ ఒక తల్లి ఆనందం వ్యక్తం చేస్తోంది. గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పాయకరావు పేటలో వివాహ కార్యక్రమానికి హజరైన సందర్భంగా మానసిక వైకల్యంతో బాధపడుతున్న ఒక బాలుడి పరిస్థితి, అతడి తల్లి ఆవేదన చూసి చలించి తక్షణ ఆర్థిక సహాయం, వికలాంగ పింఛను మంజూరుకు కాకినాడ జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లాకు సూచించారు.
కాకినాడ జిల్లా శంఖవరం మండలం, మండపం గ్రామానికి చెందిన మహిళ నక్కా తనూజ 10 ఏళ్ల కుమారుడు నక్కా ధర్మతేజ పుట్టినప్పటి నుండి మానసిక వైకల్యంతో బాధపడుతున్నాడు. ధర్మతేజ పూర్తిగా తల్లిపై ఆధారపడడం వల్ల కూలి పనులు చేసుకుని జీవించే తనూజ ఆర్థికంగాను, మానసికంగాను తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటూ తన కుమారుడికి వికలాంగ పింఛను ఇప్పించాలని అధికారులకు అర్జీ పెట్టుకుంది. కానీ మంజూరు కాలేదు.
నిరాశకు లోనైన తనూజ తన నిస్సహాయ స్థితిని రాష్ట్ర ముఖ్యమంత్రికి విన్నవించుకుని సహాయం అర్థించాలని తన కొడుకుతో సహా గురువారం పాయకరావు పేటలో వివాహ కార్యక్రమానికి హాజరైన జగతా అప్పారావు కళ్యాణ మండపం వద్దకు చేరి జనం మధ్యలో నిలుచుంది. ఇంతలో అక్కడకు చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బస్సు లో నుండి దీన వదనంతో నిలబడిన తనూజను చూసి, బస్సు దిగి దగ్గరకు పిలిచి ఆమె కష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. బాలుడు ధర్మతేజ పరిస్థితి, తల్లి తనూజ వేదనను చూసి చలించిన ముఖ్యమంత్రి తన వెంట వచ్చిన కాకినాడ జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లాను పిలిచి తల్లికి తక్షణం 10 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించి, వచ్చే నెల నుండి బాలుడు ధర్మతేజకు వికలాంగ పింఛను అందేలా చూడాలని సూచించారు.
పిలిచి సహాయం అందించి, తన కష్టాలను తొలగించిన ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి మంచి మనసుకు తల్లి నక్కా తనూజ పదే పదే కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆనందాశ్రువులతో ఆయనకు వందనాలు చేసింది. సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటన ముగిసిన వెంటనే రెండు గంటలలోపే జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా… తల్లి తనూజ, బాలుడు ధర్మతేజలను కాకినాడ కలెక్టరేటుకు పిలిపించి, డిఆర్డిఏ పిడి కె. శ్రీరమణి తో ప్రత్యేక వాహనం ఏర్పాటు చేయించారు. గురువారం మధ్యాహ్నం కలెక్టరేట్ లోని తన ఛాంబరులో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 10 వేల రూపాయల తక్షణ ఆర్థిక సహాయం బాలుడి తల్లికి అందించారు. అలాగే బాలుడికి వచ్చే నెల నుండి వికలాంగ పింఛను మంజూరు పత్రం జారీ చేసారు. బాలుడి నూరు శాతం వైకల్యం దృష్ట్యా అతడికి 35 వేల రూపాయల విలువైన వీల్ చైర్ అందచేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగన్ కు ఆ తల్లి ధన్యవాదాలు తెలిపింది..
CM Jagan Humanity: మానవత్వం చాటుకున్న జగన్.. హ్యాట్పాఫ్ అంటున్న నెటిజన్లు