ఏపీలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి స్మారకార్థం అవార్డులు ప్రధానత్సవ కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుజాతి తరఫున అందరికి శుభాకాంక్షలు.. కేంద్రం పద్మ అవార్డులను, భారతరత్న వంటి అవార్డులతో సత్కరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అలాంటి అవార్డులు ఇవ్వాలని వైఎస్ఆర్ అవార్డులు ఇస్తున్నాం’ అని అన్నారు.
‘నిండైన తెలుగుదనం నాన్నగారి పంచెకట్టులో కనిపిస్తుంది. ఆకాశమంత ఎత్తు ఎదిగిన ఆ మహామనిషి పేరు మీద అత్యున్నత పౌర పురస్కారాలు ఇస్తున్నాం. వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులకు 10 లక్షలు, అచీవ్మెంట్ అవార్డులకు 5 లక్షలు ఇవ్వడం జరుగుతుంది’ అని ఆయన తెలిపారు. అంతేకాకుండా ప్రతీ సంక్షేమ పథకం ప్రతీ పేదవాడికి అత్యంత పారదర్శకంగా ఇచ్చామని, అవార్డుల ఎంపికలో కుల, మత, ప్రాంత, రాజకీయాలను చూడలేదని, మనిషిని మనిషిగానే చూసామన్నారు.
రాష్ట్ర చరిత్రలోనే భేదాభిప్రాయాలు లేని అత్యంత ఉన్నత అవార్డులు ఇస్తున్నామని, మన సంస్కృతిని ఇనుమడింప చేసిన ప్రతీ ఒక్క మహోన్నత వ్యక్తికి, వ్యవస్థకి, సంస్థలకు అవార్డులిస్తున్నామని ఆయన తెలిపారు. రైతుకు, వ్యవసాయానికి, వ్యవసాయ అనుబంధ రంగాల్లో విప్లవానికి ఇస్తున్న అవార్డులని అన్నారు. ప్రతీ ఏటా నవంబరు 1న ఈ అవార్డులు ఇస్తామని ప్రకటించారు.