MLA Jagan Controversy: చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల “బెంగళూరును చిత్తూరోళ్లు ఏలుతున్నారు” అనే వ్యాఖ్యలతో కర్ణాటకలోని కన్నడ పరిరక్షణ సమితి నిరసనలు వ్యక్తం చేయగా, ఎమ్మెల్యే అనంతరం క్షమాపణ చెప్పారు. ఈ వ్యవహారం సద్దుమణగకముందే మరో వివాదం తెరపైకి వచ్చింది. తాజాగా కట్టమంచిలో జరిగిన ఆలయ కుంభాభిషేక కార్యక్రమంలో చెప్పులు ధరించి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించినట్లు ఉన్న ఫొటోను వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ ఘటన రాజకీయంగా దుమారం రేపింది.
ఈ రెండు అంశాలపై టిడిపి, వైసీపీ నాయకులు పోటాపోటీగా మీడియా సమావేశాలు నిర్వహిస్తూ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా ఇరు పార్టీల కార్యకర్తలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వివాదాల వెనుక వైసీపీ హస్తం ఉందని టిడిపి ఆరోపిస్తుండగా, తమకు ఎలాంటి సంబంధం లేదని వైసీపీ నేతలు ఖండిస్తున్నారు. ఎమ్మెల్యే నిర్లక్ష్యం కారణంగానే ఈ సమస్యలు తలెత్తాయని వైసీపీ వాదిస్తోంది. ఈ వ్యవహారాలపై నిజానిజాలు తేల్చేందుకు కాణిపాకం వినాయక స్వామి ఆలయంలో సత్యప్రమాణానికి రావాలని టిడిపి, వైసీపీ నాయకులు ఒకరికి ఒకరు సవాళ్లు విసురుకోవడం రాజకీయ వేడిని మరింత పెంచుతోంది.

