Chittoor Mayor Couple Murder Case: 2015లో జరిగిన చిత్తూరు మేయర్ కఠారి దంపతుల హత్య కేసులో కోర్టు మరోసారి సీరియస్ అయింది. ఆరు నెలల క్రితం ఇదే కేసులో చింటూ సహా ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేసిన న్యాయస్థానం.. ఇప్పుడు అధికారుల తీరుపై కఠిన చర్యలకు దిగింది. మేయర్ అనురాధ, భర్త మోహన్ హత్య కేసులో మొత్తం 160 మంది సాక్షులు ఉండగా.. వారిలో 14 మంది ప్రభుత్వాధికారుల వ్యవహారం కోర్టు దృష్టికి వచ్చింది. ఈ 14 మందిలో 8 మంది వివిధ కారణాలతో సాక్ష్యం చెప్పడానికి నిరాకరించారు. మరో 6 మంది తమ సాక్ష్యాలను మార్చి చెప్పినట్లు విచారణలో తేలింది.
Read Also: Hormuz Strait: చమురు కష్టాలకు బ్రేక్.. హోర్ముజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్!
దీంతో ఆరు నెలల క్రితం ఉరిశిక్ష తీర్పు ఇచ్చిన కోర్టు.. ఈ 14 మంది అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. అయితే, షోకాజ్ నోటీసులకు సమాధానం ఇచ్చినప్పటికీ.. వారి సంజాయిషీలతో సంతృప్తి చెందని కోర్టు.. 14 మంది ప్రభుత్వ ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరుకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఈ 14 మందిపై ప్రైవేటు కేసులు నమోదు చేయాలని కూడా స్పష్టం చేసింది. ఈ హత్య కేసులో నిందితులకు ఉరిశిక్షలతో పాటు.. సాక్ష్యాలను మార్చిన, కోర్టుకు సహకరించని అధికారులపై కూడా కఠిన చర్యలు తప్పవని కోర్టు హెచ్చరికలు జారీ చేసింది.
