పోలవరం ప్రాజెక్టుకు వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వల్లే తీవ్ర నష్టం జరుగుతోందంటూ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటిదాకా జరిగిన నష్టం, డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి గల కారణాలు, ప్రాజెక్టుపై వైసీపీ వైఖరి తదితర విషయాలను చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు. వైసీపీ ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలతో పోలవరం ప్రాజెక్టుకు నష్టం వాటిల్లుతోందని లేఖలో ఆరోపించారు చంద్రబాబు. వైసీపీ ఏకపక్ష నిర్ణయాలతో పోలవరం ప్రాజెక్టుకు సాంకేతికంగా నష్టం జరిగిందని కూడా చంద్రబాబు ఆరోపించారు. ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడం పట్ల వైసీపీ ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదన్న చంద్రబాబు.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతోందన్నారు.
ప్రాజెక్టు పనులు మధ్యలో నిలిచిపోయిన కారణంగానే డయాఫ్రం వాల్ దెబ్బతిన్నదని, రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టు పనులను రాష్ట్ర ప్రభుత్వం మరో కంపెనీకి అప్పగించిందని చంద్రబాబు మండిపడ్డారు. ఈ క్రమంలో ఆకస్మికంగా పనుల నిలిపివేతతో కొత్త ఏజెన్సీ పనులకు 6 నెలల సమయం పట్టిందని, పనులు చేపట్టకపోవడం వల్లనే డయాఫ్రం వాల్ దెబ్బ తిన్నదన్నారు. పనుల ఆలస్యంపై వైసీపీ ప్రభుత్వాన్ని టీడీపీ హెచ్చరించిందని తెలిపి చంద్రబాబు.. కేంద్రం చొరవతో పోలవరం ప్రాజెక్టును త్వరతగతిన పూర్తి చేయాలని కోరారు.