వరదల్లో ప్రభుత్వ వైఫల్యంపై న్యాయ విచారణ చేయాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ సీఎస్ సమీర్ శర్మకు లేఖ రాసారు. ప్రభుత్వ అంచనాల ప్రకారం రూ. 6054 కోట్ల నష్టం వాటిల్లితే.. కేవలం రూ. 35 కోట్ల నిధులను మాత్రమే విడుదల చేయడం సరైవ పద్దతి కాదని, ప్రకృతి వైపరీత్యాల కోసం ఖర్చు పెట్టాల్సిన రూ. 1100 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లించిందని కాగ్ తప్పు పట్టిందన్నారు. జాతీయ ప్రకృతి విపత్తుల నిర్వహాణ నిబంధనలకు విరుద్దంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయిందని ఆరోపించారు.
తిరుపతి సమీపంలోని తుమ్మలగుంట చెరువును ఆట స్థలంగా మార్చడంతో తిరుపతి నగరాన్ని వరదలు ముంచెత్తాయన్నారు. వరదల్లో ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంపై న్యాయ విచారణ జరిపించాలని, కడప, చిత్తూరు, నెల్లూరు, అనంత జిల్లాల్లో వరదల కారణంగా భారీగా ప్రాణ నష్టం, ఆస్తి, పంట నష్టం సంభవించాయన్నారు. రోడ్లు, వంతెనలు, విద్యుత్ కమ్యూనికేషన్ వ్యవస్థలు దారుణంగా దెబ్బ తిన్నాయని, తుఫాను, వరద తగ్గి చాలా రోజులైనా ఇప్పటికీ బాధితులు తిండి, వసతి లేక రోడ్ల మీదే ఉన్నారని, చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 25 లక్షలు, మిగిలిన బాధిత కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఇళ్లు కోల్పోయిన వారికి ఇళ్లు కట్టివ్వాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.