CM Chandrababu : కుప్పం నుంచే విజయదుందుభి.. మున్సిపల్, స్థానిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలి

  • కుప్పం నేతలకు సీఎం చంద్రబాబు కీలక దిశానిర్దేశం
  • స్థానిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని పిలుపు
  • పనితీరు ఆధారంగానే పార్టీ పదవుల కేటాయింపు
  • 2029లో భారీ మెజార్టీయే లక్ష్యమన్న సీఎం
Cm Chandrababu

Cm Chandrababu

CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ ముఖ్య నేతలు, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేవలం పై స్థాయిలోనే కాకుండా క్షేత్ర స్థాయిలో కూడా సమర్థవంతమైన పొలిటికల్ గవర్నెన్స్ (రాజకీయ పరిపాలన) ఉండాలని స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారం విషయంలో పోలీసులు, అధికారులతో పార్టీ యంత్రాంగం నిరంతరం సమన్వయం చేసుకోవాలని, క్షేత్రస్థాయిలోని వాస్తవాలను వారికి వివరించి సమస్యలను పరిష్కరించేలా చూడాలని సూచించారు. పేదల పక్షాన నిలిచే, మంచికి అండగా ఉండే టీడీపీ నేతలు, కార్యకర్తలను ప్రభుత్వ యంత్రాంగం , పోలీసులు ఖచ్చితంగా గౌరవించాల్సిందేనని సీఎం పేర్కొన్నారు. ప్రజలతో అనుసంధానమై ప్రభుత్వ పథకాల అమలును నిరంతరం పరిశీలించాలని, వాటి అమలులో ఏమైనా ఇబ్బందులు లేదా జాప్యం జరిగితే ఆ బాధ్యతను కార్యకర్తలే తీసుకుని సరిచేయాలని పిలుపునిచ్చారు. “ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఛారిటీ చేద్దాం… పార్టీ ద్వారా రాజకీయమే చేద్దాం” అని ఆయన దిశానిర్దేశం చేశారు.

గొడ్డలి పార్టీ కుట్రలపై అప్రమత్తత.. స్థానిక సంస్థల్లో వంద శాతం విజయం

గత 2019-24 మధ్య కాలం రాష్ట్రానికి ఒక పీడకల లాంటిదని, ఆనాడు కుప్పం నియోజకవర్గంలో కూడా ప్రశాంతతను చెడగొట్టాలని నాటి పాలకులు ప్రయత్నించారని చంద్రబాబు మండిపడ్డారు. గొడ్డలి పార్టీ చేసే కుట్రల పట్ల క్యాడర్ అంతా అప్రమత్తంగా ఉండాలని, కుప్పంలో ఎవరైనా రౌడీయిజం చేయాలనుకుంటే సాగనిచ్చేది లేదని హెచ్చరించారు. త్వరలోనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని, కుప్పం నియోజకవర్గంలోని అన్ని స్థానాలతో పాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపాల్టీలు, స్థానిక సంస్థలన్నింటినీ కూటమే గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. సమాజంలో తెలుగుదేశం కార్యకర్తలు, నేతలకు మంచి పేరు, గుర్తింపు ఉంటుందని.. దానికి భంగం కలిగేలా, చెడ్డపేరు వచ్చేలా ఏ ఒక్కరూ వ్యవహరించకూడదని హితవు పలికారు.

పనితీరు ఆధారంగానే పదవులు.. 2029లో భారీ మెజార్టీయే లక్ష్యం

పార్టీలో పదవుల నియామకాల్లో ఎలాంటి మొహమాటాలు ఉండవని, కేవలం పనితీరు ఆధారంగానే పదవులు దక్కుతాయని చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించబోమని, ద్వితీయ శ్రేణి నాయకులు కూడా నిఖార్సైన కార్యకర్తలను గౌరవించాలని సూచించారు. బూత్ స్థాయి మొదలుకుని ఏ పదవికైనా కార్యకర్తల ఆమోదం ఉండాల్సిందేనన్నారు. 2029 ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని, అయితే గతానికంటే భారీ మెజార్టీలు పెరిగేలా ఇప్పటి నుంచే కృషి చేయాలన్నారు. కార్యకర్తల ఆర్థిక సాధికారతకు పార్టీ పరంగా కృషి చేస్తున్నామని, ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఇంటికో పారిశ్రామికవేత్త’ విధానాన్ని ప్రజలతో పాటు పార్టీ కార్యకర్తలు కూడా అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమాన్ని పార్టీ సూచనలకు అనుగుణంగా సక్రమంగా నిర్వహించాలని, అందరి ఆమోదంతో కుప్పంలో త్వరలోనే ఒక బలమైన సమన్వయ కమిటీని వేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.