నేను 40 ఏళ్ల పాటు రాజకీయాలు చూశాను. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఎప్పుడూ చూడలేదు అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం, పోలీసులు కుమ్మక్కై పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. ఆర్గనైజ్డుగా ఒకేసారి రాష్ట్రంలో వివిధ చోట్ల దాడులు చేశారు. పార్టీ కార్యాలయల పైనా దాడులు ఎప్పుడూ జరగలేదు. 100 మీటర్లలోపే డీజీపీ కార్యాలయం ఉన్నా.. దాడులు ఆపలేకపోయారు. డీజీపీకి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు. గవర్నరుకు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేశారు.. పరిస్థితి వివరించాను. డీజీపీకి.. సీఎంకు తెలిసే ఈ దాడి జరిగింది. డ్రగ్ మాఫియాకు రాష్ట్రం అడ్డాగా మారింది అని అన్నారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ కోరల నుంచి బయటపడేయాలని కోరడం మా తప్పా అని ప్రశ్నించారు.
ఏపీలో గంజాయి ఉత్పత్తి చేసి దేశం మొత్తం సరఫరా చేస్తుంటే మేం ప్రశ్నించకూడదా అని అడిగారు. స్టేట్ టెర్రరిజానికి వ్యతిరేకంగా రాష్ట్ర బంద్ కు పిలుపిస్తున్నాం. పార్టీ కార్యాలయాలపై దాడి చేసి చంపేయాలని చూస్తారా.. పులివెందుల రాజకీయాలు చేస్తారా అని ప్రశ్నించారు. పార్టీ కార్యాలయంపై దాడులు చేసి చంపే ప్రయత్నం చేస్తోంటే డీజీపీ ఎక్కడ పడుకున్నారు. డీజీపీ నేరస్తులతో లాలూచీ పడతారా అన్నారు. ఇది టీడీపీకి సంబంధించిన విషయం కాదు.. ప్రజాస్వామ్యానికి సంబంధించిన విషయం. పార్టీ కార్యాలయం పైనా.. నేతల పైనా దాడులు జరిగితే.. ప్రజాస్వామ్యం ఎక్కడిది… శాంతి భద్రతలు ఫెయిల్ అయ్యాయి. డీజీపీ కార్యాలయం పక్కన దాడులు చేస్తే ఆర్టికల్ 356 ఎందుకు అమలు చేయకూడదు అని అడిగారు.