సిరిమాను సంబరానికి అంతా సిద్ధమయింది, ఉత్తరాంధ్ర కల్పవల్లి పూసపాటి వంశీయుల ఇలవేల్పు అయిన పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి విజయనగరం జిల్లా ముస్తాబైంది. కరోనా కారణంగా పైడిమాంబ ఉత్సవాలను గతంలోలా కాకుండా చాలా సాదాసీదాగా జరపనున్నారు. రెండో ఏడాదీ భక్తులు లేకుండానే అమ్మవారి ఉత్సవాలు జరగనున్నాయి. అమ్మవారిని కనులారా వీక్షించే అవకాశం లేకుండా పోయిందని భక్తులు వాపోతున్నారు.
ఇదిలా వుంటే.. సిరిమాను ఊరేగింపునకు సర్వం సిద్ధం అయింది. కోట బురుజుపై చేరుకున్నారు రాజవంశీయులు అశోక్ గజపతి రాజు కుటుంబసభ్యులు. కోట బురుజు పైకి వచ్చారు ఆనంద్ గజపతి రెండవ భార్య సుధా గజపతి. ఊర్మిళ మాత్రం అందుబాటులో లేరు. మాన్సస్ మాజీ చైర్ పర్సన్ సంచయిత సంబరానికి దూరంగా వుండడం చర్చనీయాంశంగా మారింది. ఆహ్వానం లేనందునే దూరంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
పైడితల్లి అమ్మ వారి ఉత్సవాలకు భక్తుల రాకపోకలను కూడా నియంత్రించేందుకు భారీగా ఏర్పాట్లు చేశారు. ప్రజా రవాణాను నిలిపివేయటంతో పాటు వ్యాపార సముదాయాలను కూడా మూసివేశారు. సిరిమానుతో పాటు వెంట తిరిగే వివిధ రథాల వెనుక వాలంటీర్లను మాత్రమే అనుమతించనున్నారు. వీటితోపాటు ఆలయంలో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.సిరిమాను సంబరానికి పోలీసు యంత్రాంగం కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లుచేసింది. సుమారు 2 వేల 500 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
ఇతర ప్రాంతాల ప్రజలు విజయనగరంలోకి ప్రవేశించకుండా పోలీసు యంత్రాంగం ఆంక్షలు విధించారు.అమ్మవారి ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలైన పులివేషాలు, ఘటాల ప్రదర్శనను సైతం నిషేధించారు. ప్రతీ వార్డుకు రెండు ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేసి అమ్మవారి పూజలు, సిరిమానోత్సవాన్ని ప్రజలు వీక్షించే అవకాశం కల్పించారు.