ఆంధ్రప్రదేశ్లోని చేనేత, మరమగ్గాల కార్మికులకు కూటమి ప్రభుత్వం చారిత్రాత్మకమైన తీపి కబురును అందించింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని చిత్తశుద్ధితో అమలు చేస్తూ, రాష్ట్రంలోని నేతన్నల కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ ప్రతిష్టాత్మక పథకం ఏప్రిల్ 1, 2026 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా అమల్లోకి రాబోతోంది. దీని ద్వారా రాష్ట్రంలోని సుమారు 1.03 లక్షల నేతన్నల కుటుంబాలకు ఆర్థికంగా ఊరట లభించడమే కాకుండా, వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ప్రభుత్వం గట్టిగా విశ్వసిస్తోంది.
Ishan Kishan: ఇషాన్ కిషన్ మనసు దోచిన సుందరి ఈమెనే.. త్వరలో పెళ్లి బాజాలు!
ఈ పథకం కింద ప్రభుత్వం నిర్దిష్టమైన విద్యుత్ రాయితీలను ప్రకటించింది. చేనేత కార్మికులకు నెలకు 200 యూనిట్ల వరకు, , మరమగ్గాల (Power Looms) కార్మికులకు నెలకు 500 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందించనున్నారు. లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యిందని, బడ్జెట్లో ఈ పథకానికి అవసరమైన నిధులను ప్రత్యేకంగా కేటాయించామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయం వల్ల ఒక్కో చేనేత కుటుంబానికి ఏడాదికి సగటున రూ. 8,640, , మరమగ్గాల యజమానులకు ఏడాదికి రూ. 21,600 వరకు ఆదా అవుతుందని అంచనా. ఈ పథకం అమలు ద్వారా ప్రభుత్వంపై ఏడాదికి సుమారు రూ. 85 కోట్ల అదనపు భారం పడనున్నప్పటికీ, కులవృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారిని ఆదుకోవడమే పరమావధిగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై చేనేత జౌళి శాఖ మంత్రి సవిత హర్షం వ్యక్తం చేస్తూ, నేతన్నల కుటుంబాల తరపున ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గతంలో చేనేతలకు ఉన్న పెన్షన్ వయస్సును తగ్గించడంతో పాటు, పెన్షన్ మొత్తాన్ని రూ. 3,000 నుంచి రూ. 4,000కు పెంచిన ప్రభుత్వం, ఇప్పుడు ఉచిత విద్యుత్ ద్వారా మరో భారీ హామీని నెరవేర్చిందని ఆమె పేర్కొన్నారు. ఇది కేవలం ఎన్నికల హామీ మాత్రమే కాదని, చేనేత రంగాన్ని మళ్లీ పూర్వ వైభవానికి తీసుకురావడానికి వేసిన బలమైన అడుగు అని ఆమె అభివర్ణించారు. ఏప్రిల్ 1 నుంచి నేతన్నల ఇళ్లలో కొత్త వెలుగులు నిండబోతున్నాయని రాజకీయ వర్గాలతో పాటు సామాన్య ప్రజలు కూడా ప్రశంసిస్తున్నారు.
