ఏపీలోని మునిసిపల్ స్కూళ్ళ స్థితిగతులు మెరుగుపరుస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చారు. టీచర్ ఎమ్మెల్సీలతో పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమావేశం నిర్వహించారు. ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీలతో సచివాలయంలోని తన ఛాంబర్లో సమావేశమైన మంత్రి బొత్స పలు ఆదేశాలిచ్చారు. మున్సిపల్ స్కూళ్ల స్థితిగతులపై మంత్రి సమీక్ష జరిపారు.
ఈ భేటీకి ఎమ్మెల్సీలు బాల సుబ్రహ్మణ్యం, కత్తి నరసింహారెడ్డి, పి.రఘువర్మ, కల్పలత, షేక్ సాబ్జీ, శ్రీనివాసులు రెడ్డి , ఐ. వెంకటేశ్వరరావు హాజరయ్యారు. పలు సమస్యలపై మంత్రికి ఎమ్మెల్సీలు విజ్ఞాపన పత్రం అందచేశారు. టీచర్లకు సంబంధించిన పీఎఫ్, ప్రమోషన్లు, బదిలీలు, ఖాళీల భర్తీ, అప్ గ్రేడ్ అయిన స్కూళ్లకు పోస్టుల మంజూరు వంటి అంశాల పై చర్చ జరిగింది. మున్సిపల్ స్కూళ్లను అప్ గ్రేడ్ చేయాలని మంత్రిని కోరారు ఎమ్మెల్సీలు.
నూతన విద్యావిధానం 2020 ప్రకారం మున్సిపల్ స్కూళ్ల మ్యాపింగ్ ప్రక్రియ తరువాత సిబ్బంది కొరత, అప్ గ్రేడేషన్ వంటి సమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు మంత్రి. పరీక్షలు పూర్తైన తరువాత ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ వుంటుందని స్పష్టం చేశారు మంత్రి బొత్స. హైస్కూళ్ల హెడ్ మాస్టర్లకు డీడీఓ బాధ్యతలను ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. పీఎఫ్ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ నాయక్ను ఆదేశించారు మంత్రి బొత్స సత్యనారాయణ.