ఏపీలో వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. గిరిజన ప్రాంతాలలో పనిచేస్తున్న స్పెషలిస్టు డాక్టర్లకు 30 శాతం నుంచి 50 శాతం వరకు జీతాలు పెంచుతూ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీవీవీపీ పరిధిలోని ఆస్పత్రుల్లో పని చేసే స్పెషలిస్టు డాక్టర్లకు 50 శాతం, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు (జనరల్), డీఏఎస్ లకు 30 శాతం మేర జీతాలు పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పెంచిన జీతాలు మార్చి 1వ తేదీ నుంచే వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
మరోవైపు ఏపీ వైద్య ఆరోగ్యశాఖలో బదిలీలు షురూ అయ్యాయి. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో బదిలీల ప్రక్రియకు ఏపీ ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. మంగళవారం నుంచి 11 బోధనాసుపత్రుల్లోని వైద్యులను ట్రాన్స్ఫర్ చేయనున్నారు. మంగళవారం ఒక్క రోజే 975 మంది వైద్యులకు వివిధ చోట్ల పోస్టింగ్స్ ఇవ్వనున్నారు. వీరిలో 215 మంది ప్రొఫెసర్లు, 150 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 610 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. డీఎంఈలో ఒకేసారి ఇంతమంది వైద్యులను బదిలీ చేయడం ఇదే తొలిసారి.
