ఏ ఒక్క పరిశ్రమను మూసి వేసే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు ఏపీ అటవీ శాఖ కార్యదర్శి విజయ్ కుమార్.. పర్యావరణ నిబంధనలకు లోబడే పరిశ్రమలను నిర్వహించాలన్న ఆయన.. రెడ్ క్యాటగిరీ పరిశ్రమల్లో కాలుష్యస్థాయి ఏ రకంగా ఉందో తనిఖీలు చేస్తుంటాం.. దీనిలో భాగంగా ఈ ఏడాది జనవరిలో 54 పరిశ్రమలను తనిఖీ చేశాం.. చిత్తూరు జిల్లాలో అమరరాజాతో పాటు విశాఖ, కాకినాడ, కడప జిల్లాల్లో కాలుష్యకారకాలు ఎక్కువగా విడుదల చేస్తున్న పరిశ్రమలకు షోకాజ్ నోటీసులు ఇచ్చామని తెలిపారు. అమరరాజా పరిశ్రమ రెండు నెలలు గడువు అడిగిందన్న విజయ్ కుమార్.. ఈ సమయం తర్వాత మరో సారి తనిఖీ చేసి పరిస్థితులు మారకపోవటంతో రెండో సారి నోటీసులు ఇచ్చామని.. లీగల్ హియరింగ్ తో వాళ్ళ వాదన విన్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.
ఇక, రాష్ట్రంలో 64 పరిశ్రమలకు ఉత్పత్తి నిలుపుదల ఆదేశాలు ఇచ్చామని తెలిపారు విజయ్ కుమార్… 50 పరిశ్రమలకు మూసివేతకు ఆదేశాలు ఇచ్చామని.. ప్రమాద కారక కాలుష్యం విడుదలను అదుపులోకి తీసుకుని వచ్చిన తర్వాత తిరిగి పరిశ్రమలు ప్రారంభించవచ్చునని పేర్కొన్నారు.. ప్రభుత్వం ఇచ్చిన మూసివేత ఆదేశాలపై స్టేతో పాటు సాంకేతిక కమిటీతో సమగ్రంగా తనిఖీ చేయించి నివేదిక ఇవ్వమని కోర్టు ఆదేశించినట్టు తెలిపిన ఆయన.. లెడ్ కలిసిన నీళ్ల వల్ల మొక్కలు, మనుషులకు తీవ్ర ప్రభావం పడుతుందని.. లెడ్ కలుషిత నీటిని ట్రీట్ మెంట్ చేయకుండా డైరెక్ట్ గా బయటకు విడుదల చేస్తోంది అమరరాజా సంస్థ అన్నారు.. దగ్గర్లో ఉన్న రిజర్వాయర్ లో ఈ నీళ్లు కలవటం ద్వారా భూమి, గాలి, నీళ్లు కలుషితమవుతున్నాయని.. దీని వల్ల అక్కడ పండుతున్న కూరగాయలు, పశువుల ఆహారం వంటి ఫుడ్ చెయిన్ ప్రభావం అవుతోందని.. 4, 5 కిలోమీటర్ల రేడియస్ లో కాలుష్య ప్రభావం పడుతోందని.. చుట్టు పక్కల నుంచి శాంపిల్స్ సేకరించి విశ్లేషించామని.. బోర్ నీళ్లలో 700 శాతం అదనంగా లెడ్ ఉందని.. చుట్టుపక్కల అనేక చెరువుల్లో కూడా లెడ్ ఉండాల్సిన స్థాయి కంటే వందల రెట్లు ఎక్కువగా ఉందని.. సిబ్బంది బ్లడ్ శాంపిళ్లలో 12 శాతం అదనంగా లెడ్ ఉన్నట్టు గుర్తించామని.. 450 మంది రక్తంలో ప్రమాదకర స్థాయిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
కోర్టు కూడా ఈ నివేదిక చూసి సంస్థ తీరు పై ఆగ్రహం వ్యక్తం చేసిందని తెలిపారు విజయ్ కుమార్.. కొంత మంది ఏకంగా 20 ఏళ్లుగా లెడ్ కు ఎక్స్ పోజ్ అవుతూ ఒకే చోట పని చేస్తుండటం చూసి నిర్ఘాంతపోయామన్న ఆయన.. కోర్టు ఆదేశాల వల్ల ఇంత లోతైన పరిశీలన జరిగిందని.. రెండో దఫా మేము తనిఖీకు వెళితే అమరరాజా ప్రతినిధులు మమ్మల్ని అడ్డుకుంటే స్థానిక పోలీసు స్టేషన్ లో కేసు పెట్టామన్నారు.. తిరుపతి పక్కన ఉన్న ప్లాంట్ ను ఇతర ప్రాంతానికి తరలించాలని కోర్టును కోరాం.. అక్కడ పునరుద్ధరించటానికి అవకాశం లేనంతగా నీరు, గాలి, భూమి కలుషితం అయ్యిందని.. పునరుద్ధరణ ఖర్చులు కూడా సదరు సంస్థ నుంచి వసూలు చేయాలని కోరాం.. చిత్తూరులో కూడా పరిశ్రమ పరిసర ప్రాంతాలు లెడ్ తో కలుషితమై ఉన్నాయన్నారు.. లెడ్ ప్రభావానికి గురి అయి ఉన్న సిబ్బందికి కూడా తగిన రక్షణ కల్పించాలని కోర్టుకు కోరామని తెలిపిన ఆయన.. అమరరాజా సంస్థ అన్ని నిబంధనలను అతిక్రమించింది.. వాటిని సరి చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు ఏపీ అటవీ శాఖ కార్యదర్శి విజయ్ కుమార్.