Vijayasai Reddy: టీడీపీ, వైసీపీకి మూడో ప్రత్యామ్నాయం మేమే.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు

Vijayasai Reddy

Vijayasai Reddy

Vijayasai Reddy: ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించబోతుంది.. పార్టీ ప్రకటనపై క్లారిటీ ఇచ్చారు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి.. అనంతపురంలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మూడో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అవసరమని అన్నారు. టీడీపీ, వైసీపీకి ప్రత్యామ్నాయంగా తమ పార్టీ ఉంటుందని పేర్కొన్నారు. విజయదశమి తర్వాత కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన గతంలో ప్రకటించిన నేపథ్యంలో తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఇక, రాష్ట్రాన్ని చంద్రబాబు, జగన్ కుటుంబాలు పాలిస్తున్నాయని విజయసాయి రెడ్డి విమర్శించారు. టీడీపీ, వైసీపీ అధ్యక్షులు అత్యంత ధనవంతులుగా ఉన్నప్పటికీ ప్రజలు మాత్రం పేదరికంలో మగ్గుతున్నారని వ్యాఖ్యానించారు. 2029లో టీడీపీకి ఓటు వేస్తే నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతారని, వైసీపీకి ఓటు వేస్తే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవుతారన్న ఆయన.. అయితే తమ పార్టీలో యువతరం నుంచి ఎవరైనా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

రాష్ట్ర అప్పులపై కూడా విజయసాయి రెడ్డి విమర్శలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రతి వ్యక్తిపై, పుట్టబోయే వ్యక్తిపై కూడా రూ.5 లక్షలకు పైగా అప్పు భారం ఉందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో గంజాయి సాగు కూడా అధికంగా ఉందని వ్యాఖ్యానించారు. ఇక, యువత వ్యక్తుల కోసం కాకుండా సీమ గడ్డ కోసం పోరాడాలని విజయసాయి రెడ్డి పిలుపునిచ్చారు. టీడీపీ, వైసీపీకి రాయలసీమ కేవలం ఓట్ల కోసమే అవసరమని విమర్శించారు. ఈ రెండు పార్టీల హయాంలో రాయలసీమలో ఏ ప్రాజెక్టు పూర్తయిందని ప్రశ్నించారు. రాష్ట్రంలో అత్యధికంగా వలసలు రాయలసీమ నుంచే జరుగుతున్నాయని అన్నారు.

తమ పార్టీ అన్ని కులాలను గౌరవిస్తుందని విజయసాయి రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదని, వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రాయలసీమను అభివృద్ధి చేసి ‘రతనాల సీమ’గా మారుస్తామని పేర్కొన్నారు. విద్యా విధానంలోనూ అసమానతలు ఉన్నాయని విజయసాయి రెడ్డి విమర్శించారు. పేదల విద్యా విధానం, ధనికుల విద్యా విధానం వేరుగా ఉన్నాయని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పారు. దక్షిణ భారతదేశంలోని ఇతర రాష్ట్రాలు అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ కంటే ముందుకు వెళ్లాయని వ్యాఖ్యానించారు. రాయలసీమ యువతకు అభివృద్ధి, ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రాంతీయ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి..