ఏపీలో ఇవాళ ప్రత్యేకమయిన రోజు. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై ఇవాళ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. అమరావతి రైతుల పిటిషన్లపై తీర్పు వెలువరించనుంది ఏపీ హైకోర్టు ధర్మాసనం. ఇప్పటికే ప్రభుత్వ, పిటిషన్ దారుల వాదనలు పూర్తి అయ్యాయి. ఫిబ్రవరి నాలుగో తేదీన తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు ధర్మాసనం. తీర్పు ఇవ్వనున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులుతో కూడిన త్రిసభ్య ధర్మాసనం.
సుమారు 70 పిటిషన్లపై తీర్పు ఇవ్వనుంది హైకోర్టు ధర్మాసనం. విచారణ జరుగుతుండగానే మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్డీఏ రద్దు చట్టాలను వెనక్కు తీసుకుంది ప్రభుత్వం. మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేసుకున్నప్పటికీ తాము దాఖలు చేసిన వ్యాజ్యాల్లో కొన్ని అభ్యర్థనలు మిగిలే ఉన్నాయని, వాటిపై విచారణ జరిపి తగిన ఆదేశాలు ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరారు పిటిషనర్ల తరఫు న్యాయవాదులు. హైకోర్టు తీర్పు అనంతరం రాజధానుల ఏర్పాటుపై న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా కొత్త బిల్లును ప్రవేశపెట్టాలని భావిస్తోంది ప్రభుత్వం. హైకోర్టు కాంప్లెక్స్ నిర్మాణం, న్యాయ నగరంలో న్యాయమూర్తుల నివాస భవనాల నిర్మాణంపై కూడా నేడు తుది తీర్పు ఇవ్వనుంది హైకోర్టు. హైకోర్టు ఇవ్వనున్న తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.