YSRCP: ఓటర్ల ధృవీకరణ ప్రక్రియను మరింత ఓటర్ ఫ్రెండ్లీగా మార్చాలని వైఎస్సార్సీపీ భారత ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి చీఫ్ ఎలక్షన్ కమిషనర్కు లేఖ రాశారు. అన్మ్యాప్డ్, మిస్మ్యాచ్డ్ ఓటర్ల ధృవీకరణలో పలు కీలక మార్పులు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఓటరు స్వయంగా హాజరు కాలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు లేదా రక్త సంబంధీకుల ద్వారా అవసరమైన పత్రాలను సమర్పించేందుకు అవకాశం కల్పించాలని కోరారు. ఉద్యోగం, చదువు, వలస కూలీలుగా ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లకు కూడా వెసులుబాటు కల్పించాలని సూచించారు. ఓటరు తరఫున పత్రాలు సమర్పించే బంధువులకు రిలేషన్షిప్ ప్రూఫ్, అధికారిక అనుమతితో అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు.
అలాగే వెరిఫికేషన్ నోటీసుల్లో ధృవీకరణ జరిగే ప్రదేశం, తేదీ, సమయం, సంబంధిత అధికారి వివరాలను స్పష్టంగా పేర్కొనాలని వైఎస్సార్సీపీ కోరింది. వెరిఫికేషన్ ప్రదేశం వివరాలు లేకుండా నోటీసులు జారీ చేయడం వల్ల ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అభ్యంతరం వ్యక్తం చేసింది. బూత్ లెవల్ ఆఫీసర్ల (BLO) ద్వారా స్థానికంగానే ఓటర్ల ధృవీకరణకు అవకాశం కల్పించాలని, పత్రాల స్వీకరణతో పాటు ప్రాథమిక, ఫీల్డ్ వెరిఫికేషన్లోనూ BLOలను భాగస్వామ్యం చేయాలని సూచించింది. ప్రతి ఓటరు ఉన్నతస్థాయి ఎన్నికల అధికారిని వ్యక్తిగతంగా కలవాల్సిన అవసరం లేకుండా స్థానిక స్థాయిలోనే సమస్యలను పరిష్కరించే వ్యవస్థ ఉండాలని కోరింది.
ఎస్ఈసీకి వల్లభనేని లేఖ..
ఇదిలా ఉండగా, SIR ప్రక్రియలో గన్నవరం నియోజకవర్గంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా చీఫ్ ఎలక్షన్ కమిషనర్కు లేఖ రాశారు. బూత్ల వారీగా 32,524 మంది ఓటర్ల జాబితాను సమర్పించలేదని ఆయన పేర్కొన్నారు. విజయవాడ రూరల్ మండలంలోని 24 నుంచి 70 వరకు ఉన్న పోలింగ్ స్టేషన్లలో పునఃపరిశీలన లేదా ఆడిట్ ఎందుకు జరగలేదో వివరించలేదని వంశీ తన లేఖలో పేర్కొన్నారు. ప్రసాదంపాడులోని 58, 59, 53 పోలింగ్ స్టేషన్లలో ‘నో మ్యాపింగ్’ కేసులు అసమానంగా ఉన్నాయని తెలిపారు. ఓటర్ల ధృవీకరణకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధమైన స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని వైఎస్సార్సీపీ కోరింది. కేవలం ప్రక్రియాపరమైన ఇబ్బందులు, నియోజకవర్గానికి దూరంగా ఉండటం లేదా నోటీసులో స్పష్టత లేకపోవడం వంటి కారణాలతో ఒక్క నిజమైన ఓటరు కూడా ఓటర్ల జాబితా నుంచి తొలగిపోకూడదని ఎన్నికల సంఘాన్ని విజ్ఞప్తి చేసింది.

