Supreme Court: X, ఫేస్‌బుక్, ఇన్‌స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

  • సోషల్ మీడియా పోస్టుల తొలగింపుపై వైసీపీ ఆగ్రహం..
  • సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైసీపీ..
  • హైకోర్టు ను ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచన..
Supreme Court

Supreme Court

Supreme Court: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సోషల్ మీడియా పోస్టులను తొలగించడంపై ఆ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఈ అంశంపై ముందుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. దీంతో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకుని హైకోర్టును ఆశ్రయించేందుకు వైసీపీ నిర్ణయించింది. జస్టిస్ దీపాంకర్ దత్త, జస్టిస్ షీల్ నాగు ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. వైసీపీ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ వాక్ స్వాతంత్ర్య హక్కును హరిస్తోందని, ప్రధాన ప్రతిపక్షం గొంతును అణిచివేసే ప్రయత్నం జరుగుతోందని పిటిషన్‌లో వైసీపీ పేర్కొంది.

వైసీపీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలైన ఎక్స్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌ నుంచి వందలాది పోస్టులను బ్లాక్ చేస్తున్నారని వైసీపీ ఆరోపించింది. ఎలాంటి కోర్టు ఆదేశాలు లేకుండానే పోస్టులను తొలగిస్తున్నారని, ఇది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘనగా పేర్కొంది. సోషల్ మీడియా పోస్టులను బ్లాక్ చేయడానికి సెక్షన్ 69A లేదా కోర్టు ఆదేశం అవసరమని ‘ష్రేయా సింఘాల్’ తీర్పును వైసీపీ తన పిటిషన్‌లో ప్రస్తావించింది. అయితే ఈ రెండు మార్గాల్లో ఏదీ అనుసరించకుండానే పోస్టులను తొలగిస్తున్నారని ఆరోపించింది.

అలాగే, పోలీసులు సెక్షన్ 79(3)(b) కింద నోటీసులు జారీ చేసి, 36 గంటల్లోగా సోషల్ మీడియా పోస్టులను తొలగించాలని ఆదేశిస్తున్నారని వైసీపీ పేర్కొంది. ఈ విధంగా ప్రతిపక్ష పార్టీ సోషల్ మీడియా కార్యకలాపాలను నియంత్రించడం ద్వారా తమ వాక్ స్వాతంత్ర్య హక్కును హరిస్తున్నారని ఆరోపించింది. అయితే ఈ అంశంపై నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించకుండా ముందుగా హైకోర్టులో పరిష్కారం కోరాలని ధర్మాసనం సూచించింది. దీంతో వైసీపీ సుప్రీంకోర్టు పిటిషన్‌ను ఉపసంహరించుకుని ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించనుంది.