YS Jagan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన రోజే సమావేశాలను బాయ్ కాట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. గవర్నర్ ప్రసంగం సమయంలో.. వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ నినాదాలు చేసి.. ఆ తర్వాత పోడియం వద్ద నిరసన వ్యక్తం చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. అనంతరం గవర్నర్ ప్రసంగం కొనసాగుతుండగానే బాయ్కాట్ చేసి వెళ్లిపోయారు.. ఇక, తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమైన వైఎస్ జగన్.. అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై కీలక వ్యాఖ్యలు చేశారు.. వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం లేనందున అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదని వైసీపీ నిర్ణయం తీసుకుంది.. అసెంబ్లీకి వెళ్లినా.. వెళ్లకున్నా.. ప్రజా సమస్యల పై పోరాటం చేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు..
Read Also: NTRNeel : ‘డ్రాగన్’ సెకండ్ షెడ్యూల్ కు భారీ ప్లానింగ్
నేనింకా ముప్పై ఏళ్ల పాటు రాజకీయాల్లో వుంటాను అని మరోసారి వ్యాఖ్యానించారు వైఎస్ జగన్.. నాతో పాటు వుండేవాళ్ళు నా వాళ్లు.. 2028 ఫిబ్రవరిలో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఆ ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలి.. పేదలకు వైసీపీ ఇచ్చిన ఇళ్ల స్థలాలు వెనక్కి తీసుకోవడం కుదరదు.. ఎక్కడైనా అలాంటి సంఘటనలు జరిగితే వారికి అండగా ఉండాలని సూచించారు.. గతంలో అసెంబ్లీకి చంద్రబాబు రాని సమయంలో కూడా ఆయన సభలో ఉంటే బాగుండేదని చెప్పా.. వాళ్లేమో సభలో వైసీపీ లేకుండా నడపాలని చూస్తున్నారు.. ఏది ఏమైనా ప్రజా సమస్యలపై ప్రజా క్షేత్రంలో పోరాడాలి అంటూ వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పిలుపునిచ్చారు పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి..
Read Also: MLC Kavitha: ‘కేసీఆర్’ ఇంటర్నెట్ సెంటర్ను ప్రారంభించిన ఎమ్మెల్సీ కవిత!
క్షేత్ర స్థాయిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రంగా ఉంది. మనం యుద్ధ రంగంలో ఉన్నాం, విజయం దిశగా అడుగులు వేయాలి. ప్రజా సమస్యల విషయంలో రాజీలేని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు జగన్.. నిజాయితీగా, చిత్తశుద్ధితో ప్రజల తరఫున పోరాటం చేయాలి. ప్రజలకు తోడుగా, ప్రజల్లో ఉంటే గెలుపు సాధించినట్టే. అందుకనే ప్రజాసమస్యలపై పోరాటంలో వెనుకడుగు వేయొద్దు అన్నారు.. ఈ ప్రభుత్వాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికీ నేను భరోసా ఇస్తున్నాను, అండగా ఉంటాను. ప్రతిపక్షంలో మన సమర్థతను నిరూపించుకోవడానికి ఇదొక అవకాశం.. పార్టీకోసం, ప్రజలకోసం గట్టిగా పనిచేస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. కళ్లుమూసుకుని, తెరిచేలోగా ఏడాది గడిచిపోతోంది. జమిలి ఎన్నికలు అంటున్నారు. అదే జరిగితే ఎన్నికలు మరింత ముందుగా వస్తాయి. అందుకే ప్రజా సమస్యల విషయంలో ఎక్కడా రాజీ వద్దు.. ప్రజల తరఫున గొంతు విప్పే విషయంలో ఎక్కడా తగ్గాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో మనం విలువలు, విశ్వసనీయత పాటిస్తున్నాం. ఎన్నో క్లిష్టపరిస్థితులను అధిగమించాం. ఇంత దూరం ప్రయాణం చేశాం. అసెంబ్లీలో మనం తప్ప వేరే ప్రతిపక్షం లేదన్నారు.
Read Also: Pakistan: ఛాంపియన్స్ ట్రోఫీపై కుట్ర.. విదేశీయుల కిడ్నాప్కు ఐసిస్ స్కెచ్!
అయితే, ప్రతిపక్ష హోదా విషయంలో అధికార పార్టీ వైఖరిని ప్రజలకు తేటతెల్లం చేసేందుకే ఇవాళ అసెంబ్లీకి వెళ్లాం. ప్రతిపక్షహోదా ఇస్తే.. హక్కుగా మనకు సమయం ఇవ్వాల్సి వస్తుంది. సభా నాయకుడికి దాదాపు సమాన స్థాయిలో సమయం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకనే ప్రతిపక్ష హోదాను ఇచ్చేందుకు ముందుకు రావడంలేదని విమర్శించారు వైఎస్ జగన్.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. నేను ఏ అంశంపై మాట్లాడినా నిందలకు, దూషణలకు దూరం. ప్రతి అంశాన్నీ ఆధారాలు, రుజువులతో మాట్లాడతాను. అసెంబ్లీలో ఎలాగూ అవకాశం లేదు కాబట్టి, ప్రెస్మీట్లలో ప్రజలకు వివరిస్తున్నాను. కాని కౌన్సిల్లో మనకు మంచి మెజార్టీ ఉంది. దీన్ని వినియోగించుకోవాలన్నారు.. మన హయాంలో 31 లక్షలమందికి ఇళ్లపట్టాలు ఇచ్చాం. పార్టీలు చూడకుండా, పక్షపాతం లేకుండా ఇళ్లపట్టాలు ఇచ్చాం. ఎవరైనా ఇళ్లుకట్టుకోకపోతే ప్రభుత్వం వారికి ఇళ్లు మంజూరుచేసి ఇవ్వాలి. పేదలపై కక్ష కట్టి పట్టాలు రద్దుచేయడం ఏంటి. పట్టాలు రద్దు చేస్తే తప్పకుండా కోర్టును ఆశ్రయిస్తాం అని హెచ్చరించారు వైఎస్ జగన్..