AP Assembly Budget Session: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధమైంది.. రేపు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10: 30కి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. సుమారు గంటసేపు స్పీచ్ ఉండే అవకాశం ఉంది. ఇక, రేపు మార్నింగ్ 11: 30 గంటలకి బీఏసీ సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించి ప్రధానంగా చర్చిస్తారు. 20 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఇక, బడ్జెట్ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరుకానున్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా రేపు గవర్నర్ ప్రసంగం జరిగే సమయంలో జగన్తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Read Also: Viral Smile Boy: జీవితాన్ని మార్చేసిన ఆ ఒక్క నవ్వు.. ఇంతకీ ఆ వైరల్ కుర్రాడు ఎవరంటే!
ఇక, అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే సమయంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఇప్పటికే పార్టీ కీలక నేతలు కసరత్తు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, ఇటీవల వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులు, తిరుమల లడ్డూ వ్యవహారంలో ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా సభలో నిరసన తెలపాలా అనే అంశాలపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రేపు మధ్యాహ్నం వైఎస్ జగన్ అధ్యక్షతన వైసీపీ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశం అనంతరం అసెంబ్లీలో వైసీపీ అనుసరించాల్సిన తుది వ్యూహంపై స్పష్టత రానుంది. గత ఏడాది కూడా బడ్జెట్ సమావేశాల తొలి రోజున గవర్నర్ ప్రసంగ సమయంలో అసెంబ్లీకి హాజరైన జగన్, ఆ తర్వాత సమావేశాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈసారి కూడా తొలి రోజు సమావేశాలకే పరిమితం అయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
శాసనమండలి సమావేశాలకు మాత్రం యథావిధిగా వైసీపీ మండలి సభ్యులు హాజరవుతారని సమాచారం. కూటమి ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలకు, ఆరోపణలకు చెక్ పెట్టే దిశగా వ్యూహాత్మకంగానే జగన్ అసెంబ్లీకి హాజరవుతున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకెళ్లడంతో పాటు, కీలక అంశాలపై గట్టిగా నిలదీయాలన్నదే వైసీపీ లక్ష్యంగా కనిపిస్తోంది. శాసనసభా పక్ష సమావేశం అనంతరం పార్టీ అధికారికంగా తన నిర్ణయాన్ని ప్రకటించనుంది.