YS Jagan: డీఎస్సీ–2025 నియామకాల అంశంపై రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనల సందర్భంగా దీక్షా శిబిరాలపై జరిగిన దాడులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. శాంతియుతంగా నిరసనలు చేపడుతున్న నిరుద్యోగ యువతపై అధికార పార్టీ శ్రేణులు దాడులకు పాల్పడడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించిన జగన్, “ఆంధ్రప్రదేశ్ Gen Z గొంతును మూయలేరు.. న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదు” అంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. డీఎస్సీ–2025 ప్రశ్నాపత్రం లీక్, నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని శాంతియుతంగా డిమాండ్ చేస్తుంటే, దానికి ప్రభుత్వం హింసతో సమాధానం ఇస్తోందని ఆరోపించారు.
విజయవాడలో రిలే నిరాహార దీక్ష నిర్వహిస్తున్న శిబిరంపై అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరులు దాడి చేసి టెంట్లను ధ్వంసం చేశారని జగన్ ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో పాటు నిరుద్యోగ యువతపై రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేశారని, మహిళలపై కూడా దాడులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ ఘటనలు పోలీసుల సమక్షంలోనే జరిగాయని విమర్శించారు. చిలకలూరిపేట, కనిగిరి, యాడికి, తాడిపత్రి, పలమనేరు, రేపల్లె, గుంటూరు, పొన్నూరు, వేమూరు, మాచర్ల, గురజాల, కందుకూరు, బాపట్ల తదితర ప్రాంతాల్లో నిరసన శిబిరాలపై దాడులు జరిగాయని, పలువురు నాయకులను పోలీసులు నిర్బంధించారని జగన్ అన్నారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కూడా ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శించారు.
డీఎస్సీ–2025 నియామక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరిగిందని ప్రభుత్వం చెబుతున్నట్లయితే, సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతోందని జగన్ ప్రశ్నించారు. నియామకాల్లో జరిగిన అక్రమాలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రూ.9,000 కోట్లకు చేరిన ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతిని, గత రెండేళ్ల బకాయిలతో సహా వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీక్షా శిబిరాలను ధ్వంసం చేయవచ్చని, నిరసనకారులను అరెస్టు చేయవచ్చని, కానీ డీఎస్సీ లీకేజీ, నియామక అక్రమాలపై ఉన్న ఆధారాలను చెరిపేయలేరని జగన్ వ్యాఖ్యానించారు. నిరుద్యోగ యువతలో ఉన్న ఆగ్రహాన్ని అణచివేయడం సాధ్యం కాదని, న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్..
https://x.com/ysjagan/status/2085653417700323716

