Site icon NTV Telugu

Nara Lokesh: ఇది తెలుగుదేశం 3.0 వర్షన్.. పైరవీలతో పనిలేదు..

Minister Nara Lokesh

Minister Nara Lokesh

Nara Lokesh: తెలుగుదేశం పార్టీ గ్రామస్థాయి నుంచి పొలిట్ బ్యూరో వరకు సమూల మార్పులు తీసుకువస్తోందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. ప్రతి టర్మ్‌లోనూ 33 శాతం (మూడో వంతు) కొత్తవారు ఉండాలన్నదే తమ అభిమతమని చెప్పారు. గ్రామస్థాయి నాయకుడు పొలిట్ బ్యూరో వరకు ఎదగడానికి అవకాశం ఉండాలని, మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీ పంథా మారాలని ఆయన పేర్కొన్నారు. అలాగైతేనే పార్టీ పదికాలాల పాటు ప్రజాక్షేత్రంలో నిలబడగలదని అన్నారు. తెలుగుదేశం కేడర్ శిక్షణా తరగతుల్లో భాగంగా “కాఫీ కబుర్లు” పేరుతో పార్టీ క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్‌చార్జిలతో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ 3.0 వెర్షన్‌తో సరికొత్త దిశగా ముందుకు సాగుతోందన్నారు. పార్టీ కేడర్‌కు సభ్యత్వ నంబర్ ఆధార్ కార్డు లాంటిదని, ఆ నంబర్ ద్వారా ఎవరు ఎంత పని చేశారో స్పష్టంగా తెలుస్తుందని చెప్పారు. పైరవీలకు తావులేకుండా కష్టపడి పనిచేసే కార్యకర్తలను గుర్తించి పదవులు ఇస్తామని తెలిపారు. ఇటీవల పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సాధారణ కార్యకర్తలు నారా చంద్రబాబు నాయుడు పక్కన కూర్చోవడం పార్టీలో వస్తున్న మార్పులకు సంకేతమని అన్నారు.

టీడీపీ రాజకీయ విశ్వవిద్యాలయం
పార్టీని అట్టడుగు స్థాయి నుంచి బలోపేతం చేయడం, కష్టపడే కార్యకర్తలను ప్రోత్సహించడం శిక్షణా తరగతుల ముఖ్య ఉద్దేశ్యమని లోకేష్ చెప్పారు. ఇకపై క్లస్టర్, యూనిట్, గ్రామ, మండల స్థాయిల్లో ఏడాది పొడవునా శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ విశ్వవిద్యాలయం లాంటిదని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రస్తుత, మాజీ ముఖ్యమంత్రులతో పాటు చాలా మంది నాయకులు టిడిపి నుంచి వచ్చిన వారేనని గుర్తుచేశారు. 1989–94 మధ్య కాలంలో చంద్రబాబు ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు ట్రైనింగ్ క్లాసులు నిర్వహించి కేడర్‌ను చైతన్యవంతం చేశారని తెలిపారు. అయితే పార్టీ ఆవిర్భావం తర్వాత అట్టడుగు స్థాయి నుంచి భారీ స్థాయిలో శిక్షణా తరగతులు నిర్వహించడం ఇదే మొదటిసారిగా జరుగుతోందన్నారు.

నాయకులు కాదు… పార్టీనే శాశ్వతం!
తెలుగుదేశం కేడర్ ఆధారిత పార్టీ అని, “నేనే రాజు, నేనే మంత్రి” అనే భావనను నాయకులు మార్చుకోవాలని లోకేష్ సూచించారు. పార్టీలో ఎవ్వరూ శాశ్వతం కారని, పార్టీ మాత్రమే శాశ్వతమని స్పష్టం చేశారు. సమర్థవంతమైన నాయకుడు తన తర్వాతి నాయకత్వాన్ని తయారుచేస్తాడని చెప్పారు. గతంలో వ్యక్తులను నమ్మడం వల్ల పార్టీ నష్టపోయిందని, ఇప్పుడు వ్యవస్థపై ఆధారపడి ముందుకు సాగుతున్నామని అన్నారు. 2014–19 మధ్య కాలంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా ఓటమి పాలయ్యామని గుర్తుచేశారు. దీర్ఘకాలంగా అధికారంలో ఉండాలంటే బీజేపీని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. పార్టీ సిద్ధాంతాలను కట్టుబాటుతో అమలు చేసే క్రమశిక్షణ గల కేడర్ ఉండటమే వారి విజయ రహస్యమని అన్నారు. మై టిడిపి యాప్ మాదిరిగానే వారికి “సరళ్” యాప్ ఉందని, గ్రామస్థాయి కార్యకర్త నుంచి కేంద్ర మంత్రి వరకు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడం వల్లే వారు విజయవంతమవుతున్నారని వివరించారు.

మహానాడును విజయవంతం చేద్దాం
1985 తర్వాత ఎన్నడూ గెలవని మంగళగిరిని ఎంచుకుని తొలి ప్రయత్నంలో ఓడిపోయానని లోకేష్ తెలిపారు. ఐదేళ్లు కష్టపడి పనిచేసి గత ఎన్నికల్లో 91 వేలకుపైగా మెజారిటీతో గెలిచానని చెప్పారు. భారీ మెజారిటీ వచ్చినప్పటికీ, నియోజకవర్గంలోని 20 బూత్‌లలో మైనస్ రావడంతో వాటిపై దృష్టి సారిస్తున్నానని తెలిపారు. కాన్ఫిడెన్స్ ఉంటే ఏదైనా సాధ్యమని చెప్పారు. పార్టీలో సమస్యలు ఉంటే అంతర్గత వేదికల్లో చర్చించి పరిష్కరించుకోవాలని, అలిగి పక్కకు తప్పుకోవడం పార్టీకి నష్టం చేస్తుందని హెచ్చరించారు. పార్టీలో సంస్కరణల కోసం తాను చంద్రబాబుతో కూడా గట్టిగా చర్చించానని పేర్కొన్నారు. మహానాడు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయని, దాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కష్టపడాలని పిలుపునిచ్చారు.

చంద్రబాబు నీడే మనకు శ్రీరామరక్ష
గత ఐదేళ్లలో అరాచక పాలనలో ఇబ్బందులు పడ్డామని లోకేష్ అన్నారు. దేవాలయాలపై దాడులు జరిగాయని, పార్టీ కార్యకర్తలపై దాడులు, తప్పుడు కేసులు నమోదయ్యాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని సమీక్షించి 60 శాతం అక్రమ కేసులను తొలగించామని చెప్పారు. మంచి రోజులు వచ్చాయని గతాన్ని మరవకూడదని, అధికారం ఉందని అహంకారం వద్దని సూచించారు. ఓర్పు, సహనంతో ముందుకు సాగాలని, నమ్మిన సిద్ధాంతాల కోసం కష్టపడాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు అనే మహావృక్షం నీడే మనకు రక్షణ అని పేర్కొన్నారు. నియమాలను పాటించని నాయకులకు మూడు సార్లు సూచనలు ఇస్తామని, వినకపోతే కొత్తవారికి అవకాశాలు ఇస్తామని స్పష్టం చేశారు.

జగన్‌ను సీరియస్‌గా తీసుకోవాల్సిన పనిలేదు
వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని లోకేష్ అన్నారు. ఒకరోజు ఒకటి, మరుసటి రోజు మరోటి మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజలకు దూరంగా ఉంటున్నారని, ఇంటి వద్ద భారీ భద్రత ఏర్పాటు చేసుకున్నారని అన్నారు. 2019లో ఓటమి తర్వాత చంద్రబాబు ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యలను తెలుసుకున్నారని గుర్తుచేశారు. ఇసుక సమస్యలపై ఉద్యమాలు చేసి, కార్యకర్తలకు అండగా నిలిచారని తెలిపారు. కేడర్‌ను ఆర్థికంగా బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. పదవులు మాత్రమే కాకుండా అవకాశాలు అందరికీ ఉంటాయని హామీ ఇచ్చారు.

హనీమూన్ ముగిసింది… జనంలోకి వెళ్లాలి!
ప్రస్తుతం పార్టీకి “హనీమూన్ పీరియడ్” ముగిసిందని, ఇకపై ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లి పనిచేయాలని లోకేష్ పిలుపునిచ్చారు. జూన్ నుంచి ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లే కార్యక్రమాన్ని రూపొందిస్తామని చెప్పారు. ప్రతి బూత్ కీలకమని, 94 శాతం స్ట్రైక్ రేటుతో గెలిచినా 4,600 బూత్‌లలో వెనకబడ్డామని గుర్తుచేశారు. పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కష్టపడాలని, గత మహానాడులో ఇచ్చిన ఆరు శాసనాలను అమలు చేయాలని కోరారు. కార్యకర్తే అధినేత అనే భావన ఇప్పటికే అమల్లోకి వచ్చిందని తెలిపారు. కూటమి మళ్లీ అధికారంలోకి రావడం ద్వారా అభివృద్ధి కొనసాగుతుందని, చంద్రబాబు బలంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని లోకేష్ పేర్కొన్నారు.

Exit mobile version