Sajjala Ramakrishna Reddy: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులను కూడా మోసం చేశారని ఆరోపించారు. ముఖ్యంగా ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద ఎంతమందికి లబ్ధి చేకూరిందో ప్రభుత్వం లెక్కలు చెప్పడం లేదని మండిపడ్డారు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రైతులు అత్యంత కీలకమని సజ్జల పేర్కొన్నారు. పార్టీ పేరులోనే ‘రైతు’ అనే పదం ఉందని గుర్తు చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టిలో వ్యవసాయ రంగానికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. రైతు విభాగాన్ని మరింత పటిష్టంగా తీర్చిదిద్దాలని, రైతాంగ సమస్యలపై ఎప్పుడైనా పోరాటానికి సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదని సజ్జల విమర్శించారు. వ్యవసాయ రంగం సంక్షోభంలో చిక్కుకుపోయిందని, దళారులు మరియు అధికార పార్టీ నేతలు కలిసి రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ జగన్ పాలనలో రైతాంగ సమస్య ఏది వచ్చినా పరిష్కరించామని సజ్జల తెలిపారు. కరోనా సమయంలో కూడా రైతుభరోసా నిధులు అందించామని చెప్పారు. రైతుల పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని గుర్తు చేశారు. రైతులు కష్టాల్లో ఉన్న సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు సింగపూర్లో పర్యటిస్తున్నారని సజ్జల విమర్శించారు. రైతాంగ సమస్యలను పక్కనపెట్టి ఇతర అంశాలపై మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలపై గట్టిగా పోరాడాలని సజ్జల పిలుపునిచ్చారు. రైతులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
