Minister Narayana: అమరావతి వర్సెస్ మావిగన్.. మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు

Minister Narayana

Minister Narayana

Minister Narayana: అమరావతి రాజధాని నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. రాజధాని నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమావేశమైన ఆయన, పనుల పురోగతిని పరిశీలించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా అమరావతి అభివృద్ధి, మావిగన్ ప్రతిపాదన, నిర్మాణాల పురోగతిపై స్పందించారు. అయితే, మావిగన్ అనే ప్రతిపాదనను ప్రజలు సీరియస్‌గా తీసుకోవడం లేదని, దాన్ని వింటే అందరూ నవ్వుతున్నారని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. పరిపాలనపై అవగాహన లేకపోవడం వల్లే ఇలాంటి వ్యాఖ్యలు వస్తున్నాయని అన్నారు. మావిగన్ వర్సెస్ అమరావతి పేరుతో ఎన్నికలకు వెళ్తామని చెప్పడాన్ని వారి పార్టీల నాయకులే వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు.

అమరావతి రాజధానిలో ప్రాథమిక మౌలిక సదుపాయాల నిర్మాణం నిర్ణయించిన గడువులోపే పూర్తవుతుందని మంత్రి నారాయణ తెలిపారు. మొత్తం 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో 4,026 నిర్మాణాలు, ట్రంక్ రోడ్లు, లేఅవుట్ రోడ్లు, ఐకానిక్ భవనాలు, హైకోర్టు భవనాల నిర్మాణం కొనసాగుతోందని చెప్పారు. అయితే, ఈ నెల 15వ తేదీ నాటికి ఎమ్మెల్యే భవనాలు, 30వ తేదీ నాటికి ఎమ్మెల్సీలు, అధికారుల భవనాలు సిద్ధమవుతాయని మంత్రి వెల్లడించారు. గ్రూప్-1, గ్రూప్-2, ఎన్జీవో ఉద్యోగుల భవనాలను నెలరోజుల్లో సాధారణ పరిపాలన శాఖ (GAD)కు అప్పగిస్తామని తెలిపారు.

అమరావతిని దోమలు లేని ఆధునిక నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారాయణ అన్నారు. అందుకోసం యూజీడీ, విద్యుత్ లైన్లు, ఇతర కేబుళ్లన్నింటినీ భూగర్భంలో ఏర్పాటు చేస్తూ రహదారుల నిర్మాణం చేపట్టామని, అందువల్లే పనులు కొంత సమయం తీసుకున్నాయని వివరించారు. కేంద్ర ప్రభుత్వ టవర్స్ నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.3,945 చెల్లిస్తున్నారని, అదే సమయంలో హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టుకు చదరపు అడుగుకు రూ.3,374 మాత్రమే ఖర్చవుతోందని మంత్రి వివరించారు. దీనిపై అనవసర ప్రచారం జరుగుతోందని అన్నారు మంత్రి నారాయణ…