Minister Kolusu Parthasarathy: రాష్ట్రంలో ప్రతిపక్ష వైసీపీ ప్రజాసేవ కంటే అరాచకాలు, అలజడి సృష్టించడానికే ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర మంత్రి పార్థసారధి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అహర్నిశలు దృష్టి సారిస్తుంటే, వైసీపీ మాత్రం యువతను రౌడీయిజం వైపు ప్రోత్సహిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు చేస్తోందని ఆయన విమర్శించారు. ప్రజలు వైసీపీ తీరును గమనిస్తున్నారని, ఆ పార్టీని రాజకీయంగా తిరస్కరించాలని భావిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. వైసీపీలో ప్రజలకు సేవ చేయడం కంటే అరాచకాలు చేయడానికే ప్రాధాన్యం ఉన్నట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆయన అన్నారు. పార్టీ అధినేత దృష్టిని ఆకర్షించాలంటే విధ్వంసం, అలజడి, సమాజంలో చీలికలు సృష్టించే చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
వివిధ ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఘటనలపై పూర్తి వాస్తవాలు బయటకు రాకముందే రాజకీయ కక్ష సాధింపుగా చిత్రీకరిస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి పార్థసారథి విమర్శించారు. ఇటువంటి రాజకీయ డ్రామాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్థంగా తిప్పికొడతారని ఆయన అన్నారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకున్న ఘటనలను ప్రస్తావించిన మంత్రి, ఇప్పుడు కర్నూలు జిల్లాలోనూ అలాంటి పరిస్థితులు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఆలూరు ప్రాంతంలో బలహీన వర్గాలపై దౌర్జన్యాలు జరిగాయని, దళితులపై దాడులు జరిగాయని కూడా ఆయన ఆరోపించారు. ఇక, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆయురారోగ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలు చేపడుతుంటే, ప్రతిపక్ష నాయకుడు జగన్ చేసిన వ్యాఖ్యలు ఆయన మానసిక ధోరణిని ప్రతిబింబిస్తున్నాయని మంత్రి అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి చర్యలనైనా ప్రభుత్వం సహించదని, చట్టం తన పని తాను చేసుకుంటుందని మంత్రి పార్థసారధి స్పష్టం చేశారు.

