అమరావతి చట్ట సవరణ బిల్లుతో ప్రజలకు ఏ మాత్రం ప్రయోజనం జరగదని వైసీపీ ఎంపీ మిధున్రెడ్డి వ్యాఖ్యానించారు. లోక్సభలో రాజధాని అమరావతి చట్ట సవరణ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. బిల్లుపై చర్చ సందర్భంగా మిధున్రెడ్డి మాట్లాడారు. ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న ‘చట్ట సవరణ బిల్లు’ ప్రజలకు ఉపయోగం ఉండదని తేల్చి చెప్పారు. బిల్లును వైసీపీ వ్యతిరేకిస్తోందని పేర్కొన్నారు.
అయితే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదని.. చట్ట సవరణ బిల్లుకు మాత్రమే వ్యతిరేకం అని చెప్పారు. ప్రస్తుతం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన చట్టం సవరణ బిల్లు స్వరూపం సరైందిగా లేదని… అందుకే వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు.
‘‘అమరావతి కోసం 33 వేల మంది రైతులు భూమిలిచ్చారు. భూమిలిచ్చిన రైతులకు అనేక హామీలిచ్చారు. రైతులకు ఎప్పుడు ప్లాట్లు ఇస్తారో బిల్లులో పెట్టాలి. రైతులకు ఇప్పటి వరకు ప్లాట్లు ఇవ్వలేదు. తనకు ప్లాట్ ఇవ్వాలంటూ రామారావు అనే రైతు గుండెపోటుతో చనిపోయాడు. కూటమి ప్రభుత్వానికి అమరావతి రైతుల గురించి పట్టింపు లేదు. అమరావతి అనే పేరు మాత్రమే కాదు.. రైతులకు ఏం చేస్తున్నారో స్పష్టంగా చెప్పాలి. రాజధాని నిర్ణయం రాష్ట్రం ఇష్టమని గతంలో హైకోర్టుకు కేంద్రం అఫిడవిట్ ఇచ్చింది. ఏపీ సభ్యులు ప్రత్యేక హోదా, పోలవరం గురించి మాట్లాడితే బాగుండేది. అమరావతిపై కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.5 వేల కోట్లే ఖర్చు చేసింది.’’ అని మిధున్రెడ్డి ఆరోపించారు. బిల్లును వ్యతిరేకిస్తూ సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లుగా మిధున్ రెడ్డి వెల్లడించారు. దీంతో వైసీపీ ఎంపీలంతా సభ నుంచి వెళ్లిపోయారు.