NTV Telugu Site icon

Polavaram Project: పోలవరం ప్రాజెక్టుపై విదేశీ నిపుణుల కీలక సూచనలు.. డిజైన్‌ మార్పులతో..!

Polavaram

Polavaram

Polavaram Project: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రాజెక్టుల్లో కీలకమైనది పోలవరం ప్రాజెక్టులు.. అయితే, పోలవరం ప్రాజెక్టు సవాళ్లపై అధ్యయనం చేసిన విదేశీ నిపుణుల బృందం కీలక సూచనలు చేసింది. వర్షాకాలం దాటగానే పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు వీలుగా డిజైన్‌, నిర్మాణ అంశాలు చర్చించేందుకు వర్క్ షాప్ ఏర్పాటు చేయాలని సూచించింది. ఇందులో పోలవరం ప్రాజెక్ట్‌ డిజైనర్‌, ప్రాజెక్టను పర్యవేక్షించే ఇంజినీర్ల బృందం, విదేశీ నిపుణుల బృందం ఉండాలని సూచించింది. డిజైన్ల రూపకల్పన, నిర్మాణ షెడ్యూలు నిర్ణయించడం, అందుకుతగ్గ వనరులు ఏవేంకావాలో ఈ వర్క్‌షాప్‌లో ఒక స్పష్టతకు రావాలని అభిప్రాయపడింది.. ప్రధాన డ్యాం ప్రాంతం పొడవునా సీపేజీ నీటిమట్టానికి 8 మీటర్ల ఎత్తులో ఒక ప్లాట్‌ఫాం నిర్మించాలని.. దాన్నుంచి ఎప్పుడూ నీటి మట్టం 8 మీటర్ల కన్నా దిగువన ఉండేలా పంపింగ్‌ ఏర్పాట్లు చేయాలని బృందం స్పష్టం చేసింది.. ఈ ఏర్పాట్లు వచ్చే వానాకాలంలో కూడా డయాఫ్రం వాల్‌ నిర్మాణానికి అవాంతరాలు కలిగించని స్థితిలో ఉండేలా చూడాలని విదేశీ నిపుణుల బృందం సూచించింది.

Read Also: Railway Jobs: ఆ అభ్యర్థులకు రైల్వే ఉద్యోగాలు..

కాగా, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన సీఎం చంద్రబాబు.. అప్పటి వరకు జరిగిన పనులపై ఆరా తీశారు.. ఆ తర్వాత.. పోలవరం ప్రాజెక్టు సవాళ్లపై అధ్యయనం చేసేందుకు విదేశీ నిపుణుల బృందాన్ని నియమించిన విషయం విదితమే.. ఇక, ఆ విదేశీ నిపుణుల బృందం.. క్షేత్రస్థాయిలో ప్రాజెక్టును పరిశీలించింది.. ఇప్పుడు డిజైన్‌ మార్పులతో కొత్త డయాఫ్రం వాల్‌, ప్రధాన డ్యాం నిర్మించాలని కీలక సూచనలు చేసింది.. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంల సీపేజిని పూర్తిగా నియంత్రించాలంటే ఎక్కువ ఖర్చవతుంది కాబట్టి.. వాటి జోలికి పోకుండా.. ఆ కాఫర్‌ డ్యాంలతోనే ముందుకు సాగాలని విదేశీ నిపుణుల కమిటీ సూచించింది.. ఇక, ఈ ఏడాది వర్షాకాలం దాటగానే పననులు ప్రారంభించేందుకు వీలుగా డిజైన్‌, నిర్మాణ అంశాలు చర్చించేందుకు ఒక వర్క్‌షాప్‌ ఏర్పాటు చేయాలని పేర్కొన్న నిపుణుల కమిటీ.. ఆ వర్క్‌షాప్‌లో ప్రాజెక్టుపై ఒక స్పష్టతకు రావాలని సూచించింది.