Deputy CM Pawan Kalyan: ఎంపీడీవోపై దాడి.. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కీలక ఆదేశాలు..

  • గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబుపై దాడి కలకలం..
  • అధికారులకు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కీలక ఆదేశాలు..
Pawan

Pawan

Deputy CM Pawan Kalyan: అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబుపై దాడి ఘటన కలకలం రేపుతోంది.. అయితే, ఈ ఘటనపై కీలక ఆదేశాలు జారీ చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబుపై దాడి ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని, మండల పరిషత్ కార్యాలయంలోకి చొరబడి దాడికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకొంటామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు. విధి నిర్వహణలో ఉన్న జవహర్ బాబుపై దాడి చేయడం అప్రజాస్వామిక చర్య అని మండిపడ్డ ఆయన.. ఇటువంటి దౌర్జన్యాలకు, రౌడీ చర్యలకు కూటమి ప్రభుత్వంలో తావు లేదని స్పష్టం చేశారు. గాలివీడు ఎంపీడీవోపై చోటు చేసుకున్న దాడి ఘటన గురించి అధికారులతో పవన్‌ కల్యాణ్‌ చర్చించారు. కారకులైన నిందితులపై కఠినంగా వ్యవహరించాలని, బాధిత ఎంపీడీవోకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు పవన్‌..

Read Also: Manmohan Singh: మన్మోహన్ అంత్యక్రియల్లో పాల్గొనే ప్రముఖుల షెడ్యూల్ ఇదే!

ఇక, ఎంపీడీవోకు, ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పాలని సూచించారు పవన్‌ కల్యాణ్‌.. ఎంపీడీవో జవహర్ బాబుపై దాడి చేసినవారికి రాజ్యాంగం పట్ల, ప్రజాస్వామ్యం పట్ల ఏ మాత్రం గౌరవం లేదని అర్థం అవుతోందని.. దాడి చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా బలమైన సంకేతం ఇవ్వాలని చెప్పారు. మండల పరిషత్ కార్యాలయంలో చోటు చేసుకున్న అప్రజాస్వామిక దాడిపై విచారణ చేయడంతోపాటు ఎంపీడీవో ఆరోగ్యం గురించి వాకబు చేసి నివేదిక ఇవ్వాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ను ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. కాగా, ఎంపీడీవో జవహర్‌బాబుపై వైసీపీ నాయకుడు దాడి చేసి గాయపరిచాడు. అయితే, ఎంపీపీ పద్మావతమ్మ కుమారుడు సుదర్శన్‌రెడ్డి.. ఈ రోజు ఎంపీపీ రూమ్‌ తాళాలు ఇవ్వాలని ఎంపీడీవోను కోరాడు. ఎంపీపీ లేకుండా తాళాలు ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పడంతో.. ఒక్కసారిగా అనుచరులతో కలిసి ఎంపీడీవోపై దాడి చేసినట్టుగా తెలుస్తోంది.. ఈ ఘటనపై ఎంపీడీవో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు సుదర్శన్‌రెడ్డి అరెస్ట్‌ చేసిన విషయం విదితమే..