Site icon NTV Telugu

Cyclone Montha: మొంథా తుఫాన్‌ ఎఫెక్ట్.. రైళ్లు, విమానాలు రద్దు.. స్కూళ్లు బంద్..

Cyclone Montha

Cyclone Montha

Cyclone Montha: మొంథా తీవ్ర తుఫాన్‌ విధ్వంసంతో రైల్వే శాఖ అప్రమత్తమైంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా వందకు పైగా రైలు సర్వీసులను రద్దు చేసింది. వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించాల్సిన 43 రైళ్లను తొలుత ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే రద్దు చేయగా.. ఆ తర్వాత మరో 75కి పైగా రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. అక్టోబర్‌ 27, 28, 29, 30 తేదీల్లో రద్దు చేసిన పలు రైళ్లకు సంబంధించిన జాబితాను అధికారులు సంబంధిత ఎక్స్‌ ఖాతాల్లో పోస్టు చేశారు. ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు రైలు స్టేటస్‌ను చెక్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు. రద్దైన రైళ్ల జాబితాలో సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, ఎక్స్‌ప్రెస్‌ , ప్యాసింజర్‌ రైళ్లు ఉన్నాయి.

మంగళ, బుధ, గురువారం తేదీల్లో రద్దు చేసిన రైళ్ల జాబితాను విడుదల చేసింది. విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు నడిచే రైళ్లను అధికారులు రద్దు చేశారు. రాజమండ్రి, నిడదవోలు, గుంటూరు, కాకినాడ, తెనాలి, రేపల్లె, మార్కాపురం, మచిలీపట్నం, నర్సాపూర్, విశాఖ, ఒంగోలు, భీమవరం, మాచర్ల నుంచి బయల్దేరే పలు రైళ్లను క్యాన్సిల్ చేశారు. ఇందుకు సంబంధించి ప్రయాణికులకు టికెట్‌ డబ్బులను రిఫండ్‌ చేయనున్నట్లు ప్రకటించారు. మంగళ, బుధ, గురువారాల్లో విశాఖ మీదుగా వెళ్లే పలు రైళ్లను క్యాన్సల్‌ చేశారు. అత్యవసర సేవల కోసం ప్రత్యేక రైళ్లను రెడీ చేశారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, దువ్వాడ, రాయగడ స్టేషన్లలో కంట్రోల్ రూమ్‌లు సిద్ధం చేశారు. హెల్ప్‌ లైన్‌లు సైతం సిద్ధం చేశారు.

తుఫాన్ తీవ్రత దృష్ట్యా విమానయాన శాఖ కూడా హై అలర్ట్‌లోకి వెళ్లింది. విజయవాడ ఎయిర్‌పోర్ట్ అథారిటీ ప్రకారం, షెడ్యూల్ చేసిన పలు విమాన సర్వీసులను రద్దు చేశారు.ఈ అన్ని సర్వీసులను ఇవాళ్టికి రద్దు చేసినట్టు ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపారు.ప్రత్యేకంగా, షార్జా నుంచి రావాల్సిన మరియు షార్జాకు వెళ్లాల్సిన రెండు అంతర్జాతీయ విమానాలను కూడా రద్దు చేశారు.మొత్తంగా, మొంథా తుఫాన్ ప్రభావంతో విజయవాడ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన, అలాగే విజయవాడకు రావాల్సిన అన్ని విమాన సర్వీసులను ఎయిర్ ఇండియా తాత్కాలికంగా నిలిపివేసింది.

ఇక, తుఫాన్‌ ఎఫెక్ట్‌తో పలు జిల్లాలో రెండు రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు అధికారులు.. గుంటూరు, బాపట్ల జిల్లాలకు రెడ్ ఎలర్ట్, పల్నాడు జిల్లాకు ఆరెంజ్ ఎలర్ట్ జారీ కాగా.. జిల్లావ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి.. ఈ నేపథ్యంలో.. నేడు, రేపు మిర్చి యార్డుకు సెలవులు ప్రకటించారు అధికారులు. ఇక నేడు, రేపు స్కూల్స్, కాలేజీలకు సెలవులు ప్రకటించారు.. మరోవైపు, తుఫాన్ ప్రభావంతో అర్ధరాత్రి నుంచి నెల్లూరులో వర్షాలు కురుస్తున్నాయి.. ఇవాళ కూడా రోజంతా వర్షాలు పడే అవకాశం ఉండటంతో స్కూల్స్, కాలేజీలకు సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్.. ఇక తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా వర్షం మొలైంది.. ఈ నేపథ్యంలో.. నేడు, రేపు అన్ని విద్యా సంస్థలకు సెలవు ఇచ్చారు..

Exit mobile version