CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ప్రారంభానికి ముందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వంలోని మంత్రులందరితో విడివిడిగా భేటీ అయ్యారు. ఈ సమావేశాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ భేటీల్లో ముఖ్యంగా తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) సమర్పించిన నివేదికపై కేబినెట్లో విస్తృతంగా చర్చించాలనే అంశంపై నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారానికి సంబంధించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిట్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే.
Read Also: Stock Market: ట్రేడ్ డీల్తో పండిన ఇన్వెస్టర్లకు పంట.. రూ.20 లక్షల కోట్ల సంపాదన
ఇక, ఆ తర్వాత ప్రారంభమైన కేబినెట్ ఎజెండాలో తిరుమల లడ్డూ అంశంపై ప్రత్యేక చర్చ జరుగుతుంది… సిట్ నివేదికను అధికారికంగా ప్రెజెంట్ చేసిన అనంతరం, ఈ విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తిరుమల లడ్డూ వ్యవహారం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ అంశంపై వైసీపీ, టీడీపీ మధ్య పరస్పర విమర్శలు కొనసాగుతున్న నేపథ్యంలో, ప్రభుత్వ స్థాయిలో స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడినట్లు సమాచారం. ఇదే అంశంపై ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా మంత్రులు, పార్టీ నేతలకు గట్టి సూచనలు చేసినట్లు తెలుస్తోంది. లడ్డూ అంశంపై ఎందుకు మౌనంగా ఉన్నారు? అంటూ నేతలకు పవన్ క్లాస్ తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. కేబినెట్ సమావేశంలో తిరుమల లడ్డూ అంశంతో పాటు, ప్రభుత్వ ప్రతిష్ఠకు సంబంధించిన విషయాల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని, ప్రజల విశ్వాసాన్ని కాపాడేలా చర్యలు ఉండాలని సీఎం చంద్రబాబు మంత్రులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నారని తెలుస్తోంది.